ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలులో టీడీపీ వర్సెస్ వైసీపీ...కాకపుట్టిన రాజకీయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:38 PM

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమున్నా ఒంగోలు మాత్రం ఆ వాతావరణం ఇప్పటికే మొదలైంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చాలామంది సీనియర్ రాజకీయ నాయకులు.. తమతమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్సార్సీపీ నుంచి వారసుల ఎంట్రీ భారీగానే ఉంది. వేరే చోట ఎలా ఉన్నా.. ఓ మాజీమంత్రి వారసుడి ఎంట్రీతో ఒంగోలు పాలిటిక్స్ హీటెక్కాయి. ఒంగోలులో పట్టు నిలుపుకోడానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని రంగంలోకి దింపారు.


ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో.. బాలినేని శ్రీనివాస రెడ్డి తరపున.. ప్రణీత్ రెడ్డి పార్టీ వ్యవహారాల్లో చురుగ్గ వ్యవహరిస్తున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో యాక్టివ్‌గా ఉన్నారు. అక్కడితో ఆగకుండా.. పార్టీలో చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టి.. తమ బలాన్ని పెంచుకుంటున్నారు. బాలినేని ప్రణీత్ రెడ్డి వ్యవహారం.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మింగుడు పడటంలేదు. దీంతో ఆయన్ను టార్గెట్ చేస్తూ.. తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రణీత్ రెడ్డి.. పది రూపాయలు ఇచ్చి వైసీపీ కండువా కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.


2014 అసెంబ్లీ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాస రెడ్డిపై టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ విజయం సాధించారు. కానీ.. ఆ తర్వాత 2019లో సీన్ రివర్స్ అయింది. దామచర్లపై బాలినేని ఘనవిజయం సాధించారు. అప్పటినుంచి ఒంగోలులో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతుండగానే.. సీన్‌లోని ఎంట్రీ ఇచ్చారు బాలినేని ప్రణీత్ రెడ్డి. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో కాస్త సైలెంట్‌గా ఉన్న ప్రణీత్.. ఇప్పుడు మాత్రం దూసుకెళ్తున్నారు. ఈ సమయంలో ఓ కొత్త చర్చ తెరపైకి వస్తోంది.


2024 అసెంబ్లీ ఎన్నికల్లో.. బాలినేని ప్రణీత్ రెడ్డిని పోటీ చేయించాలని శ్రీనివాస రెడ్డి ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ వద్ద ప్రస్తావించగా.. అందుకు ఆయన కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు ప్రణీత్. అయితే.. ప్రణీత్‌పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఇప్పుడే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్య ఓ టీకొట్టు విషయంపై ఒంగోలులో పెద్ద రచ్చ జరిగింది.


ఆరోపణలు, విమర్శలు ఎన్ని ఉన్నా.. ప్రణీత్ మాత్రం.. చేరికలపైనే ఫోకస్ పెట్టారు. ప్రజల మధ్య విస్తృతంగా పర్యటిస్తున్నారు. తానే పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెబుతూ.. యువకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారసుడి ఎంట్రీ ఇవ్వడంతో.. అటు బాలినేని రిలాక్స్ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏదైనా పెద్ద కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే బాలినేని సీన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా సమయాల్లో ప్రణీత్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. దీంతో తెరపైకి 'ఒంగోలు గిత్త' వచ్చింది అంటూ బాలినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa