గత ఎన్నికల్లో రాయలసీమపై పూర్తి పట్టు సాధించిన వైసీపీ ఆ పట్టు చేజారకుండా చేసుకొనేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదిలావుంటే రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు, అనంతపురం జిల్లా హిందూపూరంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే విజయం సాధించారు. ఇక మిగతా స్థానాల్లో హేమాహేమీ లీడర్లు కూడా ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణం రాయలసీమ అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.
అయితే.. 2019లో జరిగిన పొరపాట్లు మళ్లీ రిపీట్ అవ్వకుండా చంద్రబాబు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించి శ్రేణులను ఉత్తేజపరిచారు. అటు ప్రజల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. దీంతో సభల తర్వాత చంద్రబాబు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. ఇదే ఊపును కొనసాగించాలని.. నిత్యం ప్రజల్లోనే ఉండేలా నేతలు ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. చాలామంది రాయలసీమలోని తెలుగుదేశం నేతలు దీన్ని ఫాలో అవుతున్నారు కూడా.
దీన్ని గమనించిన అధికార వైసీపీ వెంటనే రంగంలోకి దిగింది. చంద్రబాబు పర్యటనలో ఉండగానే.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత చంద్రబాబు పర్యటన ముగిసిన అనంతరం కర్నూలులో సీమ గర్జన సభ జరిగింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. దీన్ని నిర్వహించారు. అయితే.. దీనికి అధికార వైఎస్సార్సీపీ వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించింది. ఆ సభలో చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి.. వైసీపీ సక్సెస్ అయ్యిందనే టాక్ వినిపిస్తోంది. అటు కొందరు మంత్రులు కూడా దీనికి హాజరై.. వైసీపీ మైలేజ్ తీసుకొచ్చారు.
అక్కడితో ఆగకుండా.. జగన్ మరో రాజకీయ వ్యూహం రచించారు. సీమ రాజకీయాలపై మంచి పట్టు ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని రంగంలోని దింపారు. దీంతో ఆయన కేవలం చిత్తూరు మాత్రమే కాకుండా అనంతపురం జిల్లాలోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో.. పార్టీలో చేరికలపైనా దృష్టి పెట్టారు. తాజాగా.. పీలేరు నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరేలా పెద్దిరెడ్డి ప్లాన్ అమలు చేశారు.
కేవలం పెద్దిరెడ్డి మాత్రమే కాదు.. ఎంపీ మిధున్ రెడ్డి, బుగ్గన రాజేంద్రాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ.. వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టి పరిష్కరిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ కథ మళ్లీ మొదటికి వచ్చిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు వైఎస్సార్సీపీ కీలక నేతలు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు డైలామాలో పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. చంద్రబాబు కర్నూలు పర్యటన తర్వాతే సీమలో రాజకీయ వేడి పెరిగిందనేది మాత్రం వాస్తవం అనే టాక్ వినిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa