ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులు,,,మీ జీతాలు ఇంకా అలస్యమయ్యే అవకాశం: సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 14, 2022, 10:11 PM

ఈ నెల జీతాలు ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఏపీలో ఇంకా జీతాలు అందలేదంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా ఒకేసారి వస్తున్నాయని, ఇది సంతోషకరమైన విషయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో రూ. 24 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేశారని తెలిపారు. అయితే, ఈ పెట్టుబడులను చూసి చంద్రబాబుకు, ఆయన మీడియాకు కడుపుమంటగా మారిందని విమర్శించారు. ఈ సమావేశంలోనే రివర్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించారని వివరించారు. ఈ విషయంలో రహస్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. అదానీలు, షిర్డీలు తమకేదో బంధువులైనట్లు, అవినీతి జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం బాగుపడాలని ఆలోచించే వ్యక్తి అని.. చంద్రబాబుది మాత్రం బరితెగింపు వ్యవహారశైలి అని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కడప స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు కట్టలేక పోయారని ప్రశ్నించారు. తాము ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ ఒక పరిశ్రమను తీసుకొచ్చామని, దాన్ని కూడా వెటకారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశరు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే.. జగన్ హయాంలో పరిశ్రమలు రాకూడదని వారి కోరిక అన్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ అర్జెంటుగా దిగిపోవాలి, చంద్రబాబు అధికారంలోకి వచ్చేయాలి.. ఈ రెండు జరిగితే.. వీళ్లకు అంతా ప్రశాంతంగా కనిపిస్తుందని చెప్పారు.


గతంలో రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు సమయానికి వేసేవారు కాదని.. మిగిలిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సైతం ఆలస్యంగానే వచ్చేవని సజ్జల గుర్తు చేశారు. కానీ, తమ వైసీపీ ప్రభుత్వం మాత్రం అందరికీ ఒకేసారి జీతాల చెల్లింపులు చేయాలన్న ప్రయత్నం చేస్తోందని, దాని వల్లే ఆలస్యం అవుతోందని చెప్పారు. మొత్తం జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో 70 శాతం వరకు 1, 2 తేదీల్లోనే జమ అవుతున్నాయన్నారు. మిగిలిన 30 శాతం చెల్లింపులే ఆలస్యం అవుతున్నాయని వివరించారు. ఈ నెలలో ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ఇకపై ఆలస్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్రాంతి నాటికి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa