రాష్ట్రంలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రూ.1,000 కోట్ల అవినీతికి రంగం సిద్ధమైందని ఆయన ఆరోపించారు. వ్యవసాయానికి మీటర్లు బిగించే నెపంతో ఈ తతంగం సాగుతోందని విమర్శించారు. ఈ మేరకు నెల్లూరులో చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. రూ.6 వేల విలువైన మీటర్ను రూ. 30 వేలకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదన్నారు.
విద్యుత్ మీటర్ల కొనుగోలులో భారీ స్కామ్ దాగి ఉందని చింతా మోహన్ ఆరోపించారు. విద్యుత్ మీటర్ల ఏర్పాటులో రూ.1,000 కోట్ల అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ అవినీతిలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని చెప్పారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో లేని విద్యుత్ మీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎందుకని ప్రశ్నించారు. ఇందులో కేంద్ర మంత్రి ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. 26 జిల్లాలకు గాను, ఒక్కో జిల్లాకు ఒక్కో ఎమ్మెల్యే సీటు చొప్పున 26 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలిచే అవకాశం ఉందని చింతా మోహన్ జోస్యం చెప్పారు. ఇక, రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పనితీరు అధ్వానంగా ఉందన్నారు. సచివాలయానికి ఐఏఎస్ అధికారులు రావడం లేదని.. పనులు జరగడం లేదని వివరించారు.
జిల్లాల్లో కొందరు కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని చింతా మోహన్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో ఎస్సార్ శంకరన్ లాంటి ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆక్షేపించారు. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa