ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ భస్మాసురుడిని మనమే సృష్టించాం. మనమే అంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 23, 2022, 02:17 PM

‘‘రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోంది. ఈ భస్మాసురుడిని మనమే సృష్టించాం. మనమే అంతం చేయాలి. ఓటు అనే అస్త్రం ప్రయోగించండి’’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి విజయనగరం జిల్లా రాజాంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు శ్రీకాకుళం జిల్లా పొందూరులోనూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘వైసీపీ పని అయిపోయింది. మహా ఉంటే మరో ఏడాది అంతే. ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే.. సైకో పోవడం ఖాయం. ఇక జగన్‌ రెడ్డికీ.. అతని పార్టీకి ప్రజలు ఉతుకుడే ఉతుకుడు’’ అని హెచ్చరించారు. ‘‘రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న తీరును ప్రజలు గమనించాలి. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఈ పరిస్థితిలో పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సాధించిన అభివృద్ధి వల్లే బుధవారం తన ఖమ్మం సభకు భారీ జనాదరణ లభించిందన్నారు. ‘‘హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తయారు చేసి యువతకు ఉద్యోగ గనిగా మార్చాం. ఇప్పుడు... ఉద్యోగాల కోసం సీమాంధ్ర నుంచి యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. మన సంపదను మనమే సృష్టిద్దాం. మన పిల్లల భవిష్యత్తును మనమే కాపాడుకుందాం. అందుకు మీ సహకారం అవసరం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa