ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 25, 2022, 11:45 PM

వంగవీటి మోహన్ రంగా ప్రజల మనస్సులో ఉండిపోయారని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని యాలాల బజార్‌లో.. వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వంగవీటి రాధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు.


'రంగా చనిపోయి 35 ఏళ్లయ్యింది. ఎమ్మెల్యేగా చేసింది కొన్నేళ్లే అయినా.. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి రంగా. పేదలకు కష్టం వస్తే అండగా నిలిచిన నాయకుడు. రంగా ఎదుగుదలను ఒక ప్రభుత్వం, వ్యవస్థ ఓర్వలేకపోయింది. రంగాను ఎదుర్కోలేక హతమార్చారు. రంగాను భౌతికంగా లేకుండా చేసినప్పటికీ.. బతికున్నోళ్లకంటే ఎక్కువగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. వంగవీటి సోదరులు 25 ఏళ్లు విజయవాడను శాసించారు. ప్రజల పక్షాన నిలిచారు. కానీ... ఆస్తులు కూడబెట్టుకోలేదు. రాధాకు కనీసం సొంతిల్లు కూడా లేదు. రాధా డబ్బుకు, పదవులకు లొంగే వ్యక్తి కాదు. తండ్రి పేరు నిలబెట్టేందుకు శ్రమిస్తున్న రాధాకు ప్రజల ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి' అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.


'రంగా విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు.. నేను, కొడాలి నాని చాలా చిన్నవాళ్లం. రంగా పేద ప్రజల మనిషి. ఎమ్మెల్యేగా చేసింది మూడేళ్లే అయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రంగా మరణం లేని మనిషి. చనిపోయి 35 ఏళ్లైనా నేటికీ ప్రజల్లో హీరోగా నిలిచిపోయారు' అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొనియాడారు.


'రంగా చనిపోయి 35 ఏళ్లవుతున్నా.. ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రంగా ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. 1989లో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చిన గొప్ప నేత రంగా. వంగవీటి రాధా భవిష్యత్తులో మంచి పదవులు చేపట్టాలని కోరుతున్నా' అని ఎంపీ బాలశౌరి వ్యాఖ్యానించారు.


'నా తండ్రి అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి. ఒక మనిషి చనిపోతే రెండో రోజుకు మర్చిపోయే రోజులివి. కానీ రంగా చనిపోయి 34 ఏళ్లైనా.. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ప్రజల పక్షాన నిలిచారు కాబట్టే.. ప్రజలు నేటికీ ఆయన్ని గుర్తుంచుకున్నారు. పదవులతో నాకు పనిలేదు. పదవులెన్ని ఉన్నా ఇవ్వలేనంత గౌరవం ఆయన వల్ల దక్కింది. నా పట్ల మీరు చూపించే అభిమానం చాలా గొప్పది. రంగా కొడుకుగానే జీవితాంతం మీ అభిమానాన్ని సొంతం చేసుకుంటా' అని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa