బీఆర్ఎస్ పార్టీ అనుకొంటున్నట్లే ఏపీలోనూ బలపడే దిశగా అడుగులేస్తోంది. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ముందుగా పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో పార్టీని విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడి నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరమని చెబుతున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానిస్తున్నట్లు ఏపీ యూత్ అండ్ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ అధ్యక్షుడు రాయపాటి జగదీశ్ అన్నారు. రైతులు, ఇతర వర్గాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు కూడా భారత రాష్ట్ర సమితిని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
కేసీఆర్.. విజన్, నిబద్ధత కారణంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు, బలహీన వర్గాలు అనేక సంక్షేమ ఫలాలు పొందుతున్నారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో రాష్ట్ర రాజధానిపై స్పష్టత లేదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని చెప్పుకొచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనూ అమలు కావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించారు.
తెలంగాణలో వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్, పరిశ్రమలు, ఐటీ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో పాటు రైతులకు మేలు చేసేలా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. గత ఎనిమిదేళ్లలో రైతుల అభివృద్ధి కోసం అనేక నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఏపీ మాత్రం అందుకు విరుద్ధంగా అనేక సమస్యలతో సతమతమవుతోందని, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకులు తమ వ్యక్తిగత అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించారని.., రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీని స్వాగతించడం చారిత్రక అవసరమని వ్యాఖ్యనించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలను కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అలాంటి నాయకుడే ఇప్పుడు ఏపీకి కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని.., ఆయన ఆవశ్యకతను వివరిస్తూ కోటి కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు జగదీశ్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. భారత రాష్ట్ర సమితి విధానాలతో ఆకర్షితులై కర్ణాటకలో పార్టీలకతీతంగా పలువురు నేతలు పార్టీలో చేరుతున్నారు. శనివారం బీదర్ జిల్లా చిల్లర్గి గ్రామంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన దాదాపు 200 మంది బీఆర్ఎస్లో చేరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa