ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు...తిరుపతిలోని 93 ప్రత్యేక కౌంటర్ల ద్వారా పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 08:25 PM

వైకుంఠ ఏకాదశి మొదలు పది రోజులపాటు శ్రీవారి వైకుంఠ ద్వారాల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించేందుకు అనుగుణంగా ఆదివారం సర్వ దర్శన టోకెన్ల జారీకి సిద్ధమైంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11 వరకు టికెట్లను తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లోని 93 ప్రత్యేక కౌంటర్లలో నేటి నుంచి జారీ చేయనున్నారు.


నేటి మధ్యాహ్నం 2 గంటల నుంచి రోజుకు 45 వేల చొప్పున పది రోజులకు ఒకేసారి 4.5 లక్షల స్లాటెడ్‌ సర్వ దర్శనం(ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను ఇవ్వనున్నారు. పది రోజుల టోకెన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా జారీ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. టికెట్ల జారీ వివరాలు ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ ద్వారా తెలుసుకొనేలా ఏర్పాట్లు చేశారు.


భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానం, విష్ణునివాసం, శ్రీనివాసం, జీవకోన జడ్పీ హైస్కూల్‌, ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ వెనుక శేషాద్రినగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాల, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, గోవిందరాజస్వామి సత్రాలు. తిరుమలలో స్థానికుల కోసం కౌస్తుభం విశ్రాంతి గృహంలో టోకెన్ల జారీ కేంద్రాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.


మరోవైపు వైకుంఠ ఏకాదశి సమయంలో వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాలతో వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టికెట్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని సూచించారు. అప్పుడు త్వరితగతిన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు.


సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు జనవరి 1 నుంచి 11 వరకు బ్రేక్ దర్శనాల కోసం వీఐపీల సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. స్వయంగా వచ్చే వీఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్‌తో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా గల పీఏసీ-4లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తారు.


మళ్లీ కొవిడ్ వ్యాపిస్తున్న పరిస్థితులు ఉన్నాయనే హెచ్చరికలతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మార్గ దర్శకాలు జారీ చేశాయి. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని టీటీడీ కోరింది. ఆలయ పరిసరాల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa