లాఠీచార్జిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో నిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. నిన్న గొల్లపల్లిలో జరిగిన లాఠీచార్జిలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారికి కుప్పం కేసీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. నేడు కేసీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తమ కార్యకర్తల మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారని ప్రభుత్వంపై మండిపడ్డారు. లాఠీచార్జి ఘటనను ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. గాయాలతో ఆసుపత్రిపాలైన తమ కార్యకర్తలు ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ కార్యకర్త చేయిపై పడిన దెబ్బ తీవ్రమైనది కావడంతో, నరాలు దెబ్బతిన్నాయో, ఇంకేం దెబ్బతిన్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని, డాక్టర్లు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఒక కార్యకర్త ఆ దెబ్బలకు స్పృహకోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa