ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి పంపారు. ఇందుకు సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు నాగూర్, కరార్బీబీ అందజేసిన వివరాలు...కొయ్యూరు మండలం మంప గ్రామానికి చెందిన గాడి చిన్నా, షేక్ రసూల్ బీబీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితం ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి యువకుడిని నిలదీశారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టగా అతను తిరస్కరించారు. దీంతో మనస్తాపం చెందిన బీబీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న గాడి చిన్నా కూడా పురుగుల మందు తాగాడు. ఇరువురి కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడింది. ఆ తరువాత నుంచి రసూల్ బీబీకి కనిపించకుండా చిన్నా మొహం చాటేశాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆమె మరింత తీవ్ర మనస్తాపం చెందింది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా, ఇంటిలో ఒక్కటే వునన్న రసూల్బీబీ పురుగులమందు తాగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. అపస్మారక స్థితిలో వున్న రసూల్బీబీని చూసి ఆందోళన చెందారు. వెంటనే ఇరుగుపొరుగు వారి సహకారంతో రాజేంద్రపాలెం పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం డాక్టర్ సూచన మేరకు నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. రసూల్బీబీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు అందిన సమాచారంతో మంప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa