పాకిస్థాన్లో మైనార్టీలపై అత్యాచారాలు, హత్యలు, అపహరణలు, బలవంతపు మతమార్పిడులకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. తాజాగా, ఓ హిందూ మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని పాక్ తొలి హిందూ మహిళా సెనేటర్ కృష్ణ కుమారి ట్విటర్ వేదికగా వెల్లడించారు. తలను వేరుచేసి, ముఖం, శరీర భాగాల్లో చర్మాన్ని ఒలిచి అతి భయానకంగా మహిళను హత్యచేసి పంట పొలాల్లో పడేశారని ఆమె తెలిపారు. 40 సంవత్సరాల వయసున్న దయా భెల్ అనే హిందూ మహిళ సింఝోరో పట్టణంలో బుధవారం హత్యకు గురైనట్టు చెప్పారు. హతురాలికి నలుగురు పిల్లల ఉన్నారని, భర్త చనిపోయాడని పేర్కొన్నారు.
తాను సంఘటనా స్థలానికి వెళ్లి సింఝోరో, షాపుర్చకర్ పోలీసులతో కలిసి తానూ సంఘటనా స్థలానికి వెళ్లినట్టు కృష్ణ కుమారి వివరించారు. అత్యంత దారుణంగా ఆమెను చంపేశారని, తలను వేరుచేసి, వక్షోజాల కోసి, చర్మాన్ని ఒలిచేశారని వాపోయింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత జియాలా అమర్ లాల్ భీల్ మాట్లాడుతూ.. దయా భెల్ మృతదేహాన్ని బుధవారం ఓ వ్యవసాయ పొలంలో గుర్తించినట్లు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరించారని, దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై హక్కుల ఉద్యమకారుడు ఫకీర్ శివ కచ్చీ తీవ్రంగా స్పందించారు. ‘‘సంఘర్ సమీపంలోని సింఝోరులో పేద హిందూ మహిళ దయా భెల్ను అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. దయా బెల్ తల, వక్షోజాలను కోసేశారు.. దారుణానికి పాల్పడిన హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని సంఘర్ ఎస్ఎస్పీని ట్యాగ్ చేశారు.
గత మార్చిలోనూ ఓ 18 ఏళ్ల హిందూ యువతిని సింధ్లో దుండుగులు కాల్చిచంపారు. రోహిలో పూజా కుమారి ఓడ్ అనే 18 ఏళ్ల బాలికను దుండుగులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. దుండుగులను ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో నడివీధిలో కాల్చి చంపారు. పాక్లో మైనార్టీలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తరుచూ మైనార్టీ వర్గాలకు చెందిన యువతలను అపహరించి, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. దేశంలోని మైనార్టీలు దీర్ఘకాలంగా బలవంతపు వివాహాలు, మతమార్పిడుల సమస్యలను ఎదుర్కొంటున్నారని హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa