వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని జనసేన పార్టీ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కర్నూలులో నాగబాబు మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం వెనక ఏదో వ్యూహం ఉండి ఉంటుందని చెప్పారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు.
ఇక, రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిధి దాటిపోయి తిట్టడం ద్వారా.. కొత్త సంస్కృతి తెచ్చారని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా విమర్శించవచ్చన్నారు. కానీ, వారు వ్యక్తిగత విషయాల్లో కూడా దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము మాత్రం వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేమని స్పష్టం చేశారు.
ఎవరెన్ని మాట్లాడినా తమ అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని నాగబాబు అన్నారు. కొందరు అనామకులు లైంలైట్లోకి రావడానికే తమపై విమర్శలు చేన్నారని.. వారికి ఉపయోగపడుతుందంటే తిట్టనివ్వండంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింహం సింగిల్ వస్తుందంటూ వైసీపీ నేతలు చేస్తున్న సినిమా డైలాగులకు తాము స్పందించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. జర్మనీని ఓడించడానికి అమెరికా, రష్యా వంటి దేశాలే కలిశాయని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే తాము కూడా ఇతరులతో కలవాల్సి వస్తుందని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అని నాగబాబు అన్నారు. తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయనని.. పార్టీని బలోపేతం చేయడానికి పని చేస్తానని వెల్లడించారు. 2019లో జనసేనకు 7 శాతం ఓట్లు వచ్చాయని.. ఇప్పుడు అది 24 శాతానికి పెరిగిందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇది 40 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేనపై జనంలో అభిమానం, నమ్మకం ఉండదన్నది నిజం కాదన్నారు. సంస్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయాయని నాగబాబు గుర్తుచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa