వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ లోపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. ఈ మేరకు కర్నూలులో నిర్వహించనున్న ఏపీ జేఏసీ అమరావతి మూడో రాష్ట్ర మహా సభల సన్నాహక సమావేశంలో భాగంగా అనంతపురంలో నిర్వహించిన భేటీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. తమకు రావాల్సిన బకాయిలనే గౌరవంగా అడుగుతున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల్లో ఐక్యత లేదంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఉద్యమం వస్తే అందరం కలిసి పోరాడతామని వెల్లడించారు.
తమకు రావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గతంలో పండగ సమయాల్లో ముందే జీతాలిచ్చేవారని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఒకటో తేదీకల్లా జీతాలు ఇవ్వండని అడిగే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టప్రకారం తమకు రావాల్సినవి కూడా ఇవ్వట్లేదని ఆక్షేపించారు.
రాష్ట్రంలో కొత్త జీవోల ఊసే లేకుండా పోయిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ, ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోలేదన్నారు. ఎవరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వట్లేదని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికీ అలవెన్సులేవీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇక, కాంట్రాక్టు ఉద్యోగులను ఇంకా ఎందుకు క్రమబద్ధీకరించలేదని ప్రశ్నించారు. ఈ విషయమై ఎన్ని కమిటీలకు చెప్పినా ఫలితం ఇంతవరకూ లేదన్నారు. కరోనా బారినపడి వందలాది మంది ఉద్యోగులు చనిపోతే ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆక్షేపించారు. కనీసం రిటైర్మెంట్ బెన్ఫిట్లు కూడా చెల్లించం లేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు వాపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa