విద్యార్థినులు నెలసరి సమయంలో శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు, కనుక ఆ సమయంలో వారు కళాశాలలకు హాజరు కాకపోయినా ఫర్వాలేదంటూ కేరళ ప్రభుత్వం ఒక ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా ఆదేశాలు కూడా జారీ చేసింది. కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమల్లో పెట్టింది. జనవరి 11 నుంచి తన విద్యార్థినులకు మెనుస్ట్రువల్ లీవ్ ఇస్తోంది.
కేరళ యూనివర్సిటీల్లో ప్రతి సెమిస్టర్ లోనూ విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి. ఇక దీనికి తోడు 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు రెండు నెలల మేటర్నిటీ లీవ్ ను కూడా ఇస్తున్నారు. ‘‘రెండు శాతం కండోనేషన్ మెనుస్ట్రువల్ లీవ్, రెండు నెలల మేటర్నిటీ లీవ్ ను యూనివర్సిటీల్లో విద్యార్థినులకు ఇవ్వాలని నిర్ణయించాం. యూనివర్సిటీలను మహిళల అనుకూల విద్యా కేంద్రాలుగా మార్చే చర్య ఇది’’ అని ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు తెలిపారు. ఈ నిర్ణయాలపై అక్కడి విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa