ఓ లోయ బస్సులోని 25 మంది ప్రయాణికుల ప్రాణాలను హరించేసేంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లి కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన పెరూలో చోటుచేసుకుంది. ప్రమాదంలో మరో 30 మంది గాయపడ్డారు. కొరియాంకా టూర్స్ కంపెనీకి చెందిన బస్సు.. 60 మంది ప్రయాణికులతో లిమా నుంచి టంబెస్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ప్రమాదాన్ని ధ్రువీకరించిన ట్రావెల్స్ సంస్థ.. మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వివరాలను వెల్లడించలేదు. కొండ ప్రాంతంలో ఘటన జరగడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టు అధికారులు తెలిపారు.
అయినప్పటికీ సహాయక బృందాలు శ్రమించి ఆ ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేశాయని పేర్కొన్నారు. బస్సులో ఇరుక్కుపోయినవారిని బయటకు తీసి.. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ప్రయాణికులు పర్యాటకులుగా తెలుస్తోంది. వారిలో చాలా మంది హైతీకి చెందినవారని అధికారులు గుర్తించారు. హైతీ నుంచి పెరూకి వచ్చే వలసదారుల సంఖ్య కూడా ఈ మధ్య పెరుగుతోంది.
పెరూలో ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కాదు. 2021లోనూ ఆండీస్ పర్వతాల్లో పర్యాటకులతో వెళ్తోన్న బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయిన ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. సరైన శిక్షణ లేని డ్రైవర్ బస్సును నడపటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. 2018లోనూ రాకీ బీచ్ వద్ద బస్సు ప్రమాదం చోటుచేసుకుని, 30 మంది చనిపోయారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa