ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీళ్ల కోసం ఎలాంటి యుద్ధానికైనా సీమ ప్రజలు సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 08:40 PM

రాయలసీమ ప్రజలు ఇక నీటి యుద్ధానికి సిద్ధమని సీమ స్టీరింగ్‌ కమిటీ కన్వీనర్‌ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లి మండలంలోని సిద్ధ్దేశ్వరం వద్ద కృష్ణానదిపై కేంద్ర ప్రభుత్వం నిర్మించబోయే ఐకానిక్‌ బ్రిడ్జికి బదులు బ్యారేజ్‌ కంబ్రిడ్జి నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజాప్రదర్శన చేపట్టారు. చలో సిద్ధేశ్వరం పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో బైరెడ్డి మాట్లాడుతూ.. సీమ ప్రజల త్యాగాల ఫలితంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌ ఏర్పడిందని, కానీ దీనితో సీమ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. సంగమేశ్వరంలో సమృద్ధిగా కృష్ణా జలాలు ఉన్నా పక్కనే ఉన్న కొత్తపల్లి మండలానికి నీరందని దుర్భర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఇంతకాలం కళ్ల్లెదుటే నదీజలాలను తరలించుకుపోతోంటే చూస్తూ ఉండిపోయామని, ఇకపై అలా ఉండేది లేదని అన్నారు. నీళ్ల కోసం ఎలాంటి యుద్ధానికైనా సీమ ప్రజలు సిద్ధమని తేల్చిచెప్పారు. సీమ నుంచి పదవులు పొందిన వారు మోసపూరిత మాటలతో ఈ ప్రాంత ప్రజల కడుపు కొడుతున్నారేగానీ వారి జీవితాల్లో వెలుగులు నింపడం లేదని మండిపడ్డారు. పీజీ, పీహెచ్‌డీలు చేసి యువత కూడా ఉపాధి పనులకు వెళ్లాల్సిన దౌర్భగ్యం సీమ జిల్లాల్లోనే దాపురించడం బాధాకరమని అన్నారు. బ్రిటిష్‌ కాలంలోనే సిద్ధేశ్వరం కృష్ణా-పెన్నార్‌ ప్రాజెక్ట్‌ నిర్మించాలని ప్రతిపాదించారని, ఆ ప్రాజెక్ట్‌ నిర్మించకపోవడం వల్లే రాయలసీమకు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. సిద్ధేశ్వరం వద్ద బ్యారేజ్‌ కం బ్రిడ్జి నిర్మాణం కోసం సీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాపక్ష నాయకులందరూ కలిసి రావాలని లేకపోతే రాజకీయ పతనం తప్పదని అన్నారు. అదేవిధంగా కృష్ణానదీ యాజమాన్యబోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని, విశాఖపట్నానికి తరలించాలనుకోవడం సరికాదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa