పొట్టకూటి కోసం బెంగళూరుకు కూలి పనులకు వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయి మృతిచెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే.......కడప జిల్లా, రామసముద్రం బోయవీధికి చెందిన మేస్త్రీ చంద్రశేఖర్ భార్య, కుమారుడు శ్రీనివాసులు(19)తో కలసి ఉళ్లో పనులు లేకపోవడంతో కొంతకాలం కిందట జీవనోపాధి కోసం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. ఈ నేపథ్యంలో సోమవారం యజమాని కుటుంబంతో కలసి శ్రీనివాసులు బెంగళూరు సమీపంలోని గంగా నదికి తీర్థయాత్రల కోసం వెళ్లారు. ఈ క్రమంలో యజమాని కుటుంబ సభ్యుల్లో ఒకరు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా వారిని కాపాడటం కోసం శ్రీనివాసులు నదిలోకి దిగారు. కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే నదిలో ఉన్న యజమాని, శ్రీనివాసులు ఇద్దరూ ప్రవాహం ఎక్కువై కొట్టుకుపోయి మృతి చెందారు. కాగా మృతుడు శ్రీనివాసులును స్వగ్రామం రామసముద్రానికి తరలించి సోమవారం సాయంత్రం అంత్య క్రియలు నిర్వహించారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మిక మరణం చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa