పర్యాటక ప్రదేశాల్లో యాత్రికుల భద్రతే లక్ష్యంగా.. టూరిస్ట్ పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీసు స్టేషన్లను.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లతో పాటుగా 10 బైక్లు, పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. పర్యాటకులకు మరింత భద్రత చేకూరేల బీచ్ పోలీసింగ్ను తీర్చిదిద్దింది ప్రభుత్వం.
పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు సీఎం జగన్. పర్యాటక ప్రదేశాల్లో యాత్రికులు నిర్భయంగా గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని.. పోలీస్ స్టేషన్లలో రిసెప్షనిస్టులు పెట్టి తోడుగా నిలిచే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇప్పుడు మరో మంచి కార్యక్రమం చేపట్టామని.. పోలీసులు కూడా ప్రజలకు స్నేహితులే అనే భావనను తీసుకురాగలిగామన్నారు.
పోలీస్ శాఖలో టూరిస్ట్ల కోసం పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్ట్లు వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సాయం చేయడం కోసం ఈ స్టేషన్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ కియోస్క్ల ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడంతో పాటూ.. వాహనాలు అందించడం, ఫస్ట్ ఎయిడ్ అవసరమైతే చేయడం.. ఏవైనా అత్యవసరమైన సహాయం చేయడం కోసం ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి అన్నారు. దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని.. దిశ చట్టాన్ని కూడా తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలు సీఎంగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. మహిళలకు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa