పదిమందికి ఆదర్శంగా నిలిచే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదువు.. పెళ్లి.. రెండింటిలో దేనిని ఎంచుకోవాలో తెలియక చాలా మంది అమ్మాయిలు సతమతమవుతారు. చదువు కొనసాగిస్తే వివాహం ఆలస్యమవుతుందని పెద్దలు ఒత్తిడి చేస్తారు. మరి, పెళ్లి చేసుకుంటే తమ కలలు నెరవేరవని అమ్మాయిలు మథనపడతారు. కానీ, కేరళకు చెందిన ఓ యువతి మాత్రం ఆ రెండింటికీ సమన్యాయం చేసింది. పెళ్లి చేసుకున్నా చదువుతో ఆగిపోదని పసుపు బట్టలతోనే పరీక్షకు హాజరయ్యింది. పెళ్లి రోజే పరీక్ష కావడంతో వధువు అలంకరణలోనే కాలేజీకి వెళ్లి ఔరా అనిపించింది. ఇప్పుడు ఆమె వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేరళకు చెందిన శ్రీలక్ష్మి అనిల్.. బేథనీ నవజీవన్ కాలేజీలో ఫిజియోథెరపీ విద్యార్థిని. ఆమెకు పెళ్లి నిశ్చయం కాగా.. పెళ్లి రోజే కళాశాలలో ప్రాక్టికల్ పరీక్ష రాయాల్సి వచ్చింది. దీంతో ఆమె పెళ్లికూతురుగా అలంకరించుకుని వచ్చింది. పట్టుచీర, ఒంటిపై నగలతో కాలేజీకి వచ్చిన శ్రీలక్ష్మికి స్నేహితులు కూడా అండగా నిలిచారు. తల్లిదండ్రులు, వరుడి కుటుంబీకుల ప్రోత్సాహంతో మండపం నుంచి నేరుగా పరీక్ష రాయడానికి వెళ్లింది.
వెళ్లగానే శ్రీలక్ష్మి అందరి విద్యార్థుల మాదిరిగానే ల్యాబ్ కోటు ధరించి పరీక్ష పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. అటు పెద్దలు నిర్ణయాన్ని.. ఇటు తన ఆకాంక్షకు సమన్యాయం చేస్తూ నవ వధువు చేసిన పనిని నెటిజన్లు స్వాగతిస్తూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. పెళ్లి తరువాత కూడా చదువుకోవచ్చని.. ఎంతో మంది అమ్మాయిలకు శ్రీలక్ష్మి స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రశంసిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa