పాకిస్తాన్ వక్రబుద్ది గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరంలేదు. భూకంపం కారణంగా తీవ్రంగా నష్టోపోయిన టర్కీని ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు టర్కీకి రెస్క్యూ సిబ్బందిని పంపించాయి. టర్కీ ప్రజలు ఆకలితో అలమటించకుండా.. రిలీఫ్ మెటీరియల్ కూడా పంపిస్తున్నాయి. టర్కీ మిత్ర దేశమైన పాకిస్థాన్ కూడా రెస్క్యూ సిబ్బందితోపాటు రిలీఫ్ మెటీరియల్ను పంపించింది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్కు తన దేశ ప్రజలకు తిండి పెట్టడానికే దిక్కు లేదు. అలాంటి పరిస్థితుల్లోనూ మిత్ర దేశాన్ని ఆదుకోవడానికి ముందుకు రావడం నిజంగా గ్రేట్ అనిపిస్తోందా..?
ఇక్కడే ఓ చిన్న మతలబు ఉంది. గత ఏడాది పాకిస్థాన్ను కనీవిని ఎరగని రీతిలో వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రపంచ దేశాలు తోచిన రీతిలో సాయం చేశాయి. టర్కీ కూడా పాక్కు రిలీఫ్ మెటీరియల్ పంపించింది. ఇప్పుడు దాన్నే పాకిస్థాన్ మళ్లీ కొత్తగా ప్యాకింగ్ చేసి పంపించిందట. ‘‘సింధు నుంచి రిలీఫ్ మెటీరియల్ టర్కీకి చేరుకుంది. వాటిపై సింధ్ ప్రభుత్వం, పాకిస్థాన్ ప్రభుత్వం అనే ట్యాగ్లున్నాయి. కానీ వాటిని ఓపెన్ చేసి చూస్తే... గతంలో వరదల సమయంలో టర్కీ పంపించిన ప్యాకెట్లే ఉన్నాయి. వాటినే మళ్లీ ప్యాకింగ్ చేసి రిలీఫ్ మెటీరియల్గా పంపించారు’’ అని పాకిస్థాన్ సీనియర్ జర్నలిస్ట్ షాహిద్ మసూద్ టీవీ ఛానెల్ లైవ్లో తెలిపారు.
మసూద్ చెప్పిన మాటలకు మహిళా యాంకర్కు నోట మాటరాలేదు. చాలా సేపటి వరకూ నిశ్శబ్దంగా ఉండిపోయిన ఆమె.. ‘ఇదెంతో సిగ్గుచేటు’ అని వ్యాఖ్యానించింది. వరద బాధితులను ఆదుకోవడానికి ఇతర దేశాలు పంపించిన సాయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం బాధితులకు పూర్తిగా అందించలేదని ఈ ఘటనను బట్టి అర్థం చేసుకోవచ్చు.
మరో విశేషం ఏంటంటే.. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం టర్కీలోని అంకారా చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్తో సమావేశమైన షరీఫ్.. సాయం అందించే విషయంలో రాజీపడబోమని తెలిపారు. ఫిబ్రవరి 8నే షరీఫ్ టర్కీ వెళ్లాలని భావించగా.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో టర్కీ సున్నితంగా వారించింది.
ముస్లిం మెజార్టీ దేశాలైన పాకిస్థాన్, టర్కీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరు దేశాలకు ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)లో సభ్యత్వం ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. కశ్మీర్ విషయంలోనూ టర్కీ పాకిస్థాన్కు వంత పడుతోంది. టర్కీకి రెస్క్యూ సిబ్బందిని పంపించడానికి పాకిస్థాన్ గగనతలం వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని భారత్ కోరగా.. పాక్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో అరేబియా సముద్రం మీదుగా రెస్క్యూ సిబ్బందిని భారత్ పంపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa