ఉద్యోగాల కోసం తాము ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని చెబుతూ.. ఆ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని ఏపీ ప్రజలకు ఏపీఎస్ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఏపీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్-2023 పేరుతో వాట్సాప్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. త్వరలో ఆర్టీసీలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, ముందుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, దానికి కొంత మొత్తం (డబ్బు) చెల్లించాలని తెలుపుతూ వాట్సాప్లో చాలా మందికి సందేశాలు అందుతున్నాయి. ఈ వార్త తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు ఇలాంటి ఫేక్ న్యూస్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇటువంటి ప్రకటన ఏదీ ఆర్టీసీ విడుదల చేయలేదు. ఎవరో మోసాలకు పాల్పడుతూ ఇలా చేసి ఉంటారు.
గతంలో ఇలాగే కొందరు ఫేక్ మెయిల్స్ ద్వారా చాలా మందిని మోసం చేసే చర్యలకు పాల్పడ్డారని, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా సులభంగా ఇలాంటి తప్పుడు వార్తలను వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతున్నారని ఆర్టీసీ తెలియజేస్తోంది. అభ్యర్థులు ముందుగానే ఫీజు చెల్లించాలని దానితో పాటు ఆధార్ కార్డులు, బ్యాంకు ఓటీపీ తదితర వివరాలన్నీ అందులో తెలపాలని సూచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మీ వివరాలన్నీ సేకరించిన తర్వాత సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ కోరుతున్నది.
ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ఉంటే ఆర్టీసీ అధికారులే మీడియా ద్వారా గాని, పత్రికల ద్వారా గాని ఆ విషయాన్నీ అందరికీ తెలియజేసి అధికారికంగా ప్రకటిస్తారు. కాబట్టి, ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మకండి. వీటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని అందరికీ ఆర్టీసీ కోరుతోంది.’’ అని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa