మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల మధ్య సాగుతున్న సోషల్ మీడియా వార్ కు కర్ణాటక సర్కార్ పుల్ స్టాప్ పెట్టింది. సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోపణలకు దిగిన ఇద్దరు మహిళా సివిల్ సర్వెంట్లకు కర్ణాటక ప్రభుత్వం ఇద్దర్నీ ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా తటస్థంగా ఉంచింది. ఐపీఎస్ అధికారిణి రూపా మౌడ్గిల్ భర్త.. మునీష్ మౌడ్గిల్ను కూడా బదిలీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ విభాగంలో కమిషనర్గా ఉన్న ఆయన్ను డీపీఏఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై తీవ్ర చర్చ జరగడంతో కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇద్దరు మహిళా అధికారులపై చర్యలుంటాయని కర్ణాటక హోం మంత్రి అరాగ జ్ఞానేంద్ర హెచ్చరించిన మర్నాడే బదిలీ చేయడం గమనార్హం.
ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరీపై ఐపీఎస్ రూపా డి.మౌడ్గిల్ ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో చేసిన పోస్టులు వివాదానికి కారణమయ్యింది. రోహిణిపై నేరుగా వ్యక్తిగత విమర్శలు చేసిన మౌడ్గిల్.. తన ఫొటోలను కొందరు ఐఏఎస్లకు పంపించారని ఆరోపించారు. రూప ఆరోపణలపై స్పందించిన రోహిణి.. ‘ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, తనపై నిరాధార ఆరోపణలు చేస్తూ, వాటిని రుజువు చేయమంటున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇరువురు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఇరువురు పరిస్పరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. అఖిల భారత సర్వీసు నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఇద్దరు మహిళా అధికారులకు చీఫ్ సెక్రటరీ మౌఖికంగా, లిఖితపూర్వకంగా సూచించారని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఇరువురు సివిల్ సర్వెంట్లు రచ్చకెక్కడంతో వారి తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేసింది.
ఇక, మైసూరు జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్తో రోహిణి జగడం గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తాజాగా రూపా వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచారు. 2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్కు చెందిన రోహిణి సింధూరి తెలుగు అమ్మాయి. తొలుత తుమకూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా, మండ్య జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. అనంతరం హసన్, మైసూరు జిల్లాల కలెక్టర్గా ఉన్నారు. మైసూరులో ఉన్నప్పుడే వివాదాలతో వార్తల్లోకి వచ్చారు.
2017లో ఆమె హసన్ జిల్లా కలెక్టర్గా నియమితులు అయ్యారు. 2018న ఆమెను కేఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా, 2019లో సిల్క్ బోర్డ్ కమిషనర్గా బదిలీ అయ్యారు. 2020లో మైసూరు జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎక్కువ రోజులు అక్కడ కొనసాగలేకపోయారు. శిల్పా నాగ్ తో తలెత్తిన వివాదం నేపథ్యంలో 2021లో బదిలీని ఎదుర్కొన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా స్థాన చలనం ఏర్పడిందామెకు. ఐపీఎస్ అధికారిణి డీ రూపతో వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రోహిణి సింధూరిపై బదిలీ వేటు వేసింది. పోస్టింగ్ ఇవ్వలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa