ఉరవకొండ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్కు ఏపీ హైకోర్టు ఊరాటనిచ్చే ఆదేశం ఇచ్చింది. పయ్యావులకు భద్రత కల్పించాల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టంచేసింది. తన భద్రతకు సంబంధించి పయ్యావుల కేశవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గతంలో విచారణ జరగ్గా.. పయ్యావుల కేశవ్కు భద్రత కల్పించాల్సిన అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే బుధవారం జరిగిన విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు.. ఉరవకొండలో పరిస్థితులు ఏంటో తమకు తెలుసని.. అలాంటప్పుడు ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 5 లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్కు ధర్మాసనం సూచించింది. అందులో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది. అయితే పిటిషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం భద్రత కల్పించిన వ్యక్తులపై పిటిషనర్కు నమ్మకం ఉండాలి కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి కేశవ్కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదిలావుంటే పయ్యావుల కేశవ్కు ఎప్పటి నుంచో ఉన్న టూ ప్లస్ టూ భద్రతను ప్రభుత్వం ఇటీవలే తొలగించిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లతో పాటు ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం కక్షపూరితంగా తన భద్రతను తగ్గించిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
ఎన్నికలు వస్తున్న తరుణంలో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని పయ్యావుల కేశవ్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో పయ్యావులకు భద్రత కల్పించాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే టూ ప్లస్ టూ భద్రతపై విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa