రాజధాని తరలింపు దిశగా వైసీపీ సర్కార్ అడుగులేస్తుందా అన్న చర్చ తాజాగా సాగుతోంది. విశాఖ నడిబొడ్డున ఆర్టీసీకి చెందిన భవనాన్ని అత్యవసరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ భవనం ప్రస్తుతం శిథిలమై.. వినియోగంలో లేదు. ఇప్పటికిప్పుడు దీన్ని ఆధునికీకరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ ద్వారకా బస్టాండ్ కాంప్లెక్సులో.. ఆర్టీసీకి బహుళ వినియోగ భవనం ఉంది. 5 అంతస్తులతో విశాలమైన ప్రాంగణాలతో.. ఏళ్ల కిందట దీన్ని నిర్మించారు. వాటిలో కొన్ని అంతస్తులను పలు అవసరాలకు వినియోగించేవారు. మిగిలినవాటిలో కొన్నింటిని అద్దెకు ఇచ్చారు. ఆర్టీసీ బిల్డింగ్ ముందు పలు వాణిజ్య సముదాయాలు రావడంతో దానికి డిమాండ్ తగ్గిపోయింది.
ఈ భవనానికి పార్కింగ్ సమస్య ఉండటంతో.. తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కొన్నేళ్లుగా అలాగే వదిలేయడంతో కొన్ని గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ ఆర్టీసీ అధికారులు తరచు డ్రైవర్లు, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో.. దీన్ని ముస్తాబు చేస్తున్నారు. అయితే.. దీన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కింది, మొదటి, రెండు, మూడో అంతస్తులను ఆధునీకీకరిస్తున్నారు. ఈ నెల 20న ఏపీఎస్ ఆర్టీసీ చీఫ్ సివిల్ ఇంజినీర్ టెండర్ ప్రకటన ఇచ్చారు. రెండు నెలల్లోగా పనులు పూర్తిచేసి అప్పగించాలని టెండరు నిబంధనల్లో స్పష్టం చేశారు.
అయితే.. ఇంత దీన్ని అత్యవసరంగా ఎందుకు ముస్తాబు చేస్తున్నారనే చర్చ విశాఖలో జరుగుతోంది. పరిపాలన రాజధానిగా విశాఖను చేస్తానని సీఎం జగన్ ప్రకటించడంతో.. దీన్ని ముస్తాబు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ భవనాన్ని ఏదైనా ప్రభుత్వ కార్యాలయంగా మారుస్తారని తెలుస్తోంది. అటు.. ఆర్టీసీ ప్రధాన కార్యాలయాన్ని విశాఖకు తరలిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే కాకుండా.. ఇంకా కొన్ని భవనాలను కూడా అధికారులు గుర్తిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ముఖ్యమంత్రి ఎప్పుడైనా విశాఖకు షిఫ్ట్ అవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa