ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం,,,ఆసక్తికర విషయాల వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 05:03 PM

తన పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్ని వర్గాల వారితో మమేకమవుతున్నారు. ఇదిలావుంటే నారా లోకేష్ యువగళం (పాదయాత్ర తిరుపతిలో కొనసాగుతోంది. నగరంలోని అంకుర హాస్పటల్ సమీపంలో ఉన్న ప్రాంగణంలో హాలో లోకేష్ పేరుతో యువతీయువకులతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఐఐఎం ప్రొఫెసర్ రాజేష్ వ్యాఖ్యాతగా ఆసక్తికరంగా సాగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లోకేష్ సమాధానాలు ఇచ్చారు. విలాసవంతమైన జీవితాన్ని ఎందుకు వదులుకుని కష్టపడుతున్నారని ప్రశ్నించగా.. రాష్ట్రం అన్ని రంగాల్లో అట్టడుగు స్థాయికి వెళ్లిపోయిందని.. రాష్ట్రాన్ని మళ్లీ అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలనే ఈ యువగళం ప్రారంభించానని లోకేష్ అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన విద్యార్థులంతా వెనక్కి రావాలని.. అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.


తాను ఎప్పడూ కన్నీరు పెట్టలేదని.. దేవాన్ష్ పుట్టినప్పుడు తనను చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆనందబాష్పాలు వచ్చాయి అన్నారు. మంగళగిరిలో టీడీపీ ఇప్పటికి రెండు సార్లే గెలిచింది అని.. అటువంటి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చాలనేది తన దృఢ సంకల్పం అన్నారు. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. మంగళగిరిలో 2024లో టీడీపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. పాదయాత్ర అయ్యాక ఎన్ని కిలోమీటర్లు నడిచినా చల్లటి నీళ్లలో కాళ్లు పెట్టుకోవాలని నాన్న సూచించారని.. పాదయాత్ర పూర్తయ్యాక చల్లటి నీళ్లలో కాళ్లు పెట్టుకుని ఆరోజు జరిగిన విషయాలపై సీనియర్ నాయకులతో చర్చిస్తాను అన్నారు. మా టీమ్, స్థానిక నాయకులతో సరదాగా మాట్లాడుతూ ఉంటానన్నారు. అది పూర్తయ్యాక ఫ్రెండ్స్ అనే టీవీ షో ఉందని.. తన కాలేజీ సమయంలో అది పాపులర్ షో అన్నారు. స్నేహితుల మధ్య సరదాగా జరిగే ఓ సంభాషణ.. ఓ ఎపిసోడ్ చూసి పడుకుంటాను అన్నారు.


తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని.. సహకరిస్తే ఇది పాదయాత్ర.. లేకుంటే దండయాత్రే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామన్నారు. పాదయాత్ర చేస్తుండగా.. టీడీపీ ప్రభుత్వంలో తెచ్చిన కంపెనీలను చూస్తున్నప్పుడు.. అందులో ఉద్యోగులు తనతో తమ సంతోషాన్ని పంచుకున్నప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది అన్నారు. తన బాధ మొత్తాన్ని మరిచిపోయానన్నారు. ఏపీలో ప్రజలు పక్క రాష్ట్రాలకు పొట్టకూటికోసం ఎందుకు వలస వెళ్లాలి అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళతాం. అదే పార్టీ అజెండా..ఈ లోకేష్ అజెండా అన్నారు.


తనకు పింక్ డైమండ్ లొల్లి అర్థం కావడం లేదని.. చంద్రబాబు పాలనలో తిరుపతి వెంకన్న పింక్ డైమండ్ కొట్టేశామని అన్న విషయాన్ని గుర్తు చేశారు. వెంకటేశ్వరస్వామి జోలికి వెళితే వాళ్ల పని గోవిందా.. గోవిందా అన్నారు. తమపై ఆరోపణలు చేసినవాళ్లు ఈ నాలుగేళ్లలో ఏం తేల్చారని.. ఆరోపణలు చేయడం చాల ఈజీ.. దిను ఏనాడూ తప్పు చేయలేదు అన్నారు. అందుకే తిరుపతి నడివీధుల్లో నడుస్తున్నాను.. తప్పు చేసిన వ్యక్తి పరదాలు కట్టుకుని బయటకు వస్తున్నారన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నూటికి నూరుశాతం స్వాగతిస్తాను అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి ముందుకొచ్చేవారిని టీడీపీ ఎప్పుడూ ఆహ్వానిస్తుంది అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa