ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్నేహితుడిని క్రూరాది క్రూరంగా చంపిన ఉన్మాది

Crime |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 11:02 PM

స్నేహానికి ఉన్న గొప్పతనం కాలరాసేలా ప్రవర్తించాడో సైకో మిత్రుడు. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని హత్య చేసిన నిందితుడు హరికృష్ణ ఒక సైకో మాదిరిగా ప్రవర్తించినట్లు హత్య జరిగిన తీరును గమనిస్తే తెలుస్తోంది. ఇంటర్ స్నేహితుడు నవీన్‌ను అతి దారుణంగా హత్య చేశాడు హరి. అతడి శరీరంలోని ఒక్కొక్క భాగాన్ని బయటికి తీస్తూ కిరాతకంగా ప్రవర్తించాడు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఆ విషయాన్ని సదరు అమ్మాయికి ఫోన్ చేసి చెప్పాడు. శరీరం నుంచి ఒక్కో భాగాన్ని వేరు చేసి ఆ ఫోటోలను ఆమెకు వాట్సాప్ చేశాడు. ‘ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు’ అంటూ నవీన్ వేలు కోసి ఆ ఫోటోను అమ్మాయికి పంపించాడు. ‘ఈ పెదాలే కదా నిన్ను తాకింది’ అంటూ పెదాలు కోసి ఆ ఫోటోను అమ్మాయికి పంపించాడు. ఈ గుండెనే కదా నిన్ను తాకింది అంటూ నవీన్ గుండెను బయటకు తీసి ఆ చిత్రాన్ని పంపించాడు. నవీన్ మర్మాంగాన్ని కూడా కోసేశాడు. తలను, మొండెంను వేరు చేసి దూరంగా పడేశాడు.


నవీన్‌ను ఏవిధంగా హత్య చేశాడో వివరిస్తూ అమ్మాయికి మెసేజ్ చేశాడు హరి. అదంతా చదివిన ఆ అమ్మాయి జోక్ అనుకుందో, ఏమో తెలియదు గానీ.. ‘అవునా ఓకే, వెరీ గుడ్’ అంటూ రిప్లై ఇచ్చింది. నిందితుడికి అమ్మాయి సహకరించిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


హరికృష్ణ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇది కూడా అతడిపై మానసికంగా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోతుందేమోనని సైకోగా మారి ప్రాణ స్నేహితుడినే కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలోని గుట్టల్లో పడేశాడు.


నవీన్, హరికృష్ణ, సదరు అమ్మాయి ఇంటర్మీడియెట్లో ఒకే కాలేజీలో చదువుకున్నారు. నాటి నుంచే వీరి మధ్య పరిచయం ఉంది. ఒకరికి తెలియకుండా మరొకరు ఇద్దరూ ఆ అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి ఇద్దరితోనూ చనువుగా ఉన్నట్లు తెలుస్తోంది.


నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్లకు చెందిన నేనావత్‌ నవీన్‌ (20) నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ (ఈఈఈ) ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. హరికృష్ణ ప్రస్తుతం పీర్జాదిగూడలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.


ఎలాగైనా నవీన్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న హరికృష్ణ పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ నెల 17వ తేదీన ‘గెట్ టు గెదర్ పార్టీ’ పేరుతో హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ చోటకు రావాల్సిందిగా పిలిచాడు. తన ఇంటర్ స్నేహితుడు హరికృష్ణ ఫోన్ చేస్తే వెళ్తున్నానని నవీన్ తన స్నేహితులకు చెప్పి వెళ్లిపోయాడు. రాత్రి 8:30 గంటల సమయంలో నవీన్ తన స్నేహితులకు ఫోన్ చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్దకు బైక్ తీసుకొని రావాల్సిందిగా చెప్పాడు. అతడు చెప్పినట్లే స్నేహితులు బైక్ తీసుకొని అక్కడికి వెళ్లి ఫోన్ చేయగా.. నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.నవీన్ స్నేహితుల్లో ఒకరు హరికృష్ణకు ఫోన్ చేశారు. తన వద్దకు వచ్చి తిరిగి వెళ్లిపోయాడని అతడు బదులిచ్చాడు. ఆ సమయంలో నవీన్ ప్రమాదంలో ఉన్నాడా? హరికృష్ణ అప్పటికే అతడిని హత్య చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.


స్నేహితుల వద్దకు వెళ్లిన నవీన్ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులను ఆశ్రయించారు. రెండు రోజుల తర్వాత హరికృష్ణ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అతడిపై అనుమానం రావడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. తనపై ఉచ్చు బిగుస్తుండటంతో నవీన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తన నేరాన్ని అంగీకరించాడు. చేతికందిన కొడుకు మృతి చెందడంతో నవీన్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa