తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో వైసీపీ సర్కార్ కు ఇరకాట పరిస్థితి తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనబాట పట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ ఉద్యోగ సంఘం నేతలు సచివాలయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి మార్చి 9వ తేదీ నుంచి చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసును అందజేశారు.
అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సారి చాయ్, బిస్కెట్ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తొలుత సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ వేళ నిరసనలు, తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని వివరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదిలావుంటే ఆదివారం విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు చర్చించారు. ప్రజా సంఘాలన్నీ తమ ఉద్యమానికి సహకరించాలని, అలాగే ఉద్యోగ సంఘాలు కూడా తమతో కలిసి రావాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa