వచ్చే ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా దాని వైరీ పార్టీలు మాత్రం తలోదారిపట్టేట్లు పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఒంటరిగానే తాము పోటీచేస్తామని, కూటమితో కలవబోమని పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీంతో బీజేపీని ఓడించడానికి భావసారూప్యత కలిగిన విపక్ష పార్టీలు కలిసిరావాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ఆదిలోనే గండిపడినట్టయ్యింది. మమతా బెనర్జీ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. సీపీఎం, కాంగ్రెస్లు బీజేపీతో కుమ్మక్కయాయని ఆరోపించారు.
‘‘అపవిత్ర పొత్తులు ఉంటే బీజేపీతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుంది? బీజేపీతో వామపక్షాలు ఎలా పోరాడతాయి.. సీపీఎం, కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకం అని ఎలా చెప్పుకుంటున్నాయి?’’ అని ప్రశ్నించారు. బెంగాల్లో జరిగిన సాగర్దిగా ఉప-ఎన్నికను దీనికి ఉదాహరణగా దీదీ పేర్కొన్నారు. సాగర్దిగా ఉప-ఎన్నికల్లో అధికార టీఎంసీకి ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. సాగర్దిగాలో కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీలు మతం కార్డును ప్రయోగించాయని మమతా ధ్వజమెత్తారు.
‘ఈ విషయంలో తేడా ఏంటంటే బీజేపీ బహిరంగంగా ఆడింది.. కానీ సీపీఎం, కాంగ్రెస్ దానికి మించి ఆడాయి’’ అని.. ఇది తమకు ఓ గుణపాఠమని అన్నారు. సీపీఎం, కాంగ్రెస్ మాటలు వినకూడదని.. బీజేపీతో కలిసి పనిచేసే వారితో పొత్తు పెట్టుకోలేమని చెప్పారు. ‘‘2024లో తృణమూల్, ప్రజల మధ్య పొత్తును చూస్తాం.. మేము ఇతర రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లం.. ప్రజల మద్దతుతో ఒంటరిగా పోరాడతాం’’ మమతా బెనర్జీ తెలిపారు.
ప్రతిపక్ష కూటమిలో కీలక భూమికి పోషించాలని తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. కానీ గత ఎన్నికల్లో బెంగాల్లోని 42 లోక్సభ సీట్లకు కేవలం 22 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ అనూహ్యంగా 18 చోట్ల విజయం సాధించింది. అప్పటి నుంచి బెంగాల్పై మమతా బెనర్జీ ఎక్కువగా దృష్టి సారించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, దీదీ హ్యాట్రిక్ సాధించారు.
వరుసగా బెంగాల్లో మూడోసారి విజయాన్ని అందుకున్న మమతా.. రాష్ట్రం వెలుపల తన పార్టీని విస్తరించాలనే బలంగా కోరుకున్నారు. కానీ ఆమె చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో గతేడాది తృణమూల్ కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. తాజాగా త్రిపురలోనూ ఆ పార్టీ చతికిలపడింది. కానీ, మేఘాలయలో మాత్రం ఐదు స్థానాలను గెలుచుకుంది. తన ప్లాన్ రివర్స్ కావడంతో ప్రస్తుతం బెంగాల్లోని 42 సీట్లను ఒడిసిపట్టి.. 2024లో ప్రధాని పీఠం ఎక్కాలనేది దీదీ ఆకాంక్ష.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa