నాలుగు పెద్దపులి పిల్లల తల్లి కోసం నంద్యాల జిల్లా ఫారెస్ట్ అధికార్లు గాలింపు తీవ్ర తరం చేశారు. నాలుగు పిల్లల్ని తల్లి దగ్గరకు చేర్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం దేశ చరిత్రలోనే తొలిసారి అంటున్నారు. అయితే తల్లి గాలింపు ప్రయత్నంలో కీలక పరిణామం గురించి ఆపరేషన్ కమిటీ మెంబర్, డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ ఆప్పవ్ ఐఎఫ్ఎస్ వివరించారు. పెద్ద గుమ్మాడాపురం అటవీప్రాంతంలోపెద్ద పులి అడుగుజాడలను అటవీ శాఖ సిబ్బంది గుర్తించినట్లు తెలిపారు.
అది తల్లి పులి (టీ108 ఎఫ్)వి అవునా? కాదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అలాగే పెద్దగుమ్మడాపురానికి ఒకటిన్నర కి.మీ. దూరంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో సంగమేశ్వరం వెళ్లే బీటీ రహదారిపైకి పులి వస్తుండగా చూశామని ఓ గొర్రెల కాపరి, పండ్ల వ్యాపారి అటవీ సిబ్బందికి చెప్పారు. దీంతో ఎఫ్డీ శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని పాదముద్రల్ని పరిశీలించారు.
ఇదిలా ఉంటే 50కిపైగా అటవీ అధికారులతో మొత్తంగా 300 మంది సిబ్బందితో ఆపరేషన్ తల్లి పులి నిర్వహిస్తున్నామన్నారు అటవిశాఖ అధికారులు. తల్లి పులి అన్వేషణ కోసం శాస్త్రీయ సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. మొత్తం 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నామన్నారు. అవసరమైతే డ్రోన్ కూడా వినియోగిస్తామన్నారు.
ఇటు ఆత్మకూరు మండలం బైర్లూటిలోని అటవీశాఖ గెస్ట్ హౌస్లో నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి. ప్రత్యేక వైద్య బృందం ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. నిపుణుల సూచనలతో పులికూనలకు పాలు, సెరోలాక్తో పాటు చికెన్ లివర్ ముక్కలను అందించారు. వాటి ఆరోగ్యం బాగానే ఉందని.. హుషారుగా ఆడుకుంటున్నాయని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa