పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును రాజకీయ సమాధి చేస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో జగన్ అలివికాని హామీలు ఇచ్చారని, అదే రీతిలో బొల్లా కూడా కులసంఘాల వారికి 3 నుంచి 5 ఎకరాలు చొప్పున ఇచ్చి ఆ సంఘాల భవనాలు ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో ఉన్న విలేకరులకు ఎన్ఎస్పీ స్థలంలో స్థలాలు ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో నీటి వసతి లేని చోట ఇళ్ల స్థలాలు విలేకరులకు ఇస్తామని వారిని మోసం చేసి ప్రతిపక్ష నాయకుడిపై నిందలు వేస్తున్నారని, మీరు ఇస్తే ఎవరు వద్దన్నారని ఎమ్మెల్యే బొల్లాను ప్రశ్నించారు. నియోజకవర్గంలో 150 గ్రామాల్లో టీడీపీ హయాంలో సిమెంటు రోడ్లు వేశామని, కనీసం వాటికి సైడ్కాలువలు కూడా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నిర్మించలేదని అన్నారు. పట్టణ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పేరుతో ఎమ్మెల్యే బొల్లా రూ.18 కోట్లు దోచుకొని 5 వేల మంది పేదలను దగా చేశారని, పట్టణానికి శాశ్వత తాగునీటి పథకానికి నిధులు, గ్రామీణ శాశ్వత తాగునీటి పథకానికి నిధులు తీసుకొస్తే ఈ నాలుగేళ్లల్లో ఆ పథకాలను పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే బొల్లా అని ఎద్దేవా చేశారు. శావల్యాపురం మండలం గంటవారిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బొల్లా అనుచరులే ధ్వంసం చేశారని, అలాగే నూజెండ్ల మండలంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని, పట్టణంలో జూనియర్ కళాశాల గ్రౌండ్లో శివశక్తి ఫౌండేషన్ ద్వారా సిమెంటు బల్లాలు ఏర్పాటు చేస్తే వాటినీ ధ్వంసం చేశారని, వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, మీసాల మురళీకృష్ణయాదవ్, సుధాకర్, జానీబాషా, రావుల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa