తూర్పు రాయలసీమ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు గురువారం చిత్తూరులో జరగనుంది. చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం ఉమ్మడి జిల్లాల బ్యాలెట్లన్నింటినీ చిత్తూరులోనే లెక్కించనున్నారు. సోమవారం పోలింగ్ ముగిశాక చిత్తూరుతోపాటు ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సుల తరలింపు సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమై.. మంగళవారం మధ్యాహ్నానికి పూర్తయ్యాయి. చిత్తూరులో పట్టభద్రుల కౌంటింగ్కు ఆర్వీఎస్ ఇంజినీరింగ్ కళాశాల (ఎస్వీసెట్)ను, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు ఎస్వీసెట్ పక్కనున్న ఎస్వీసెట్ లా కళాశాలను ఎంపిక చేశారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను రెండు కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్ల వద్దకు తీసుకొచ్చారు. వాటివెంట ఆయాజిల్లాల ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు వచ్చారు. ఈ బ్యాలెట్ బాక్సులను చిత్తూరు జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో రాజశేఖర్ పరిశీలించి.. అనంతరం కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్రూమ్లలో భద్రపరిచారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు అభ్యర్థుల సమక్షంలో ఎన్నికల పరిశీలకులు కోన శశిధర్, కాటమనేని భాస్కర్ సీల్ వేశారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వి.సురేంద్ర కుమార్, వైసీపీ చిత్తూరు నియోజకవర్గ పరిశీలకుడు కృష్ణమూర్తితోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, జేసీ వెంకటేశ్వర్, ఏఆర్వోలు రాజశేఖర్ (చిత్తూరు), శ్రీనివాసమూర్తి (తిరుపతి), జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డి, ఇతర జిల్లాల ఆర్డీవోలు పాల్గొన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను అభ్యర్థులు పరిశీలించారు. ఆర్వో, కలెక్టర్ హరినారాయణన్, ఎన్నికల పరిశీలకులు కోన శశిధర్, కాటమనేని భాస్కర్ ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa