మన సమాజంలో కొందరికి వింత వింత అలవాట్లు ఉంటాయి. ఇదిలావుంటే ఓ యువకుడి పొట్టలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 56 బ్లేడ్లు శస్త్రచికిత్స చేసిన వైద్యులు బయటకు తీశారు. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. జలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలోని డేటా గ్రామానికి చెందిన 25 ఏళ్ల యశ్పాల్ రావ్ అనే యువకుడు అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. అతడు నలుగురు స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు. యశ్పాల్కి బ్లేడ్లు తినే అలవాటు ఉంది. ఆ విషయం అతడితో కలిసి ఉంటోన్న స్నేహితులకు కూడా తెలియదు. ఎవరు లేని సమయంలో బ్లేడ్లను కేక్లా లాగించేసేవాడు. దీంతో అతడి ఆరోగ్యం క్షీణించింది.
ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తి రూమ్లోనే ఉండిపోయాడు. ఒకరోజు ఉన్నట్టుండి రక్తపు వాంతులు చేసుకున్న యశ్.. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో గదికి చేరుకున్న స్నేహితులు.. అతడి పరిస్థితి చూసి భయపడిపోయారు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు యశ్పాల్ను పరీక్షించి, ఎక్స్రే, స్కానింగ్లు చేశారు. పొట్టలో చాలా వస్తువులు ఉన్న ఆనవాళ్లు చూసి షాకయ్యారు. సోనోగ్రఫీ, ఎండోస్కోపీ వంటి పరీక్షలు చేసి యువకుడి కడుపులో మెటల్ బ్లేడ్లు ఉన్నట్టు గుర్తించారు.
ఏడుగురు వైద్యుల బృందం మూడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి చివరకు బ్లేడ్లను బయటకు తీశారు. వాటిని లెక్కించగా ఏకంగా 56 బ్లేడ్లు ఉన్నాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలకు గాయాలు కావడంతో అవి మానడానికి ఔషధాలను ఇస్తున్నట్టు తెలిపారు. బ్లేడ్లు చాలా పదునుగా ఉంటాయి. వాటిని మింగడం సాధ్యం కాదు, కాబట్టి కవర్లతో పాటు చుట్టి అలాగే మింగేసినట్టు వైద్యులకు వివరించాడు. దీని వల్ల అది గొంతులో ఎలాంటి గాయం చేయకుండా పొట్టలోకి చేరుకునేది. అయితే పూర్తి బ్లేడు గొంతులో దిగడం కష్టం కాబట్టి, దాన్ని రెండు ముక్కలుగా మధ్యకి మడిచి మింగేసినట్టు తెలిపాడు.
పొట్టలో ప్యాకింగ్ కాగితం కరిగిపోయి పదునైన బ్లేడ్లు పొట్టను గాయపరచడం మొదలుపెట్టాయి. దీంతో ఆరోగ్యం క్షీణించింది. అతడి చెప్పిన వివరాలు విని వైద్యులు నివ్వెరపోయారు. ‘బ్లేడ్లు ఎందుకు తింటున్నావ్?’ అని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. యువకుడి బంధువులకు కూడా ఈ బ్లేడ్లు తినే అలవాటు ఉన్నట్టు తెలియకపోవడం కొసమెరుపు. ఆదివారం గత ఆదివారం ఒకేసారి మూడు ప్యాకెట్లు బ్లేడ్లు మింగేసిన తర్వాతే అస్వస్థతకు గురయ్యాడు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. పొట్టలో రాళ్లు, జుట్టు, షాంపూ ప్యాకెట్లను కూడా శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. కోయంబత్తూరులో 13 ఏళ్ల బాలిక పొట్టలోంచి ఖాళీ షాంపూ ప్యాకెట్లతో పాటూ అరకిలో జుట్టును శస్త్ర చికిత్స ద్వారా తీసిన విషయం తెలిసిందే. ఆ బాలిక మానసికంగా ఆరోగ్యం బాగోలేక ఇలా జుట్టు, షాంపూ ప్యాకెట్లను మింగిందని వైద్యులు తేల్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa