విలువలు, విశ్వసనీయతే తమ పానలకు పునాదులు అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. తన పరిపాలన గురించి ఎవ్వరు ఏమనుకున్నా.. తన లెక్కలు ఏంటో స్పష్టంగా చెప్పారు. 'నాకు ఇండస్ట్రీ రంగం ఎంత ముఖ్యమో.. వ్యవసాయం అంతే ముఖ్యం. నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. అవ్వతాతలు కూడా అంతే ముఖ్యం. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమే. గత ప్రభుత్వానివి అన్నీ గాలి మాటలే. గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నాను. ఇదే నా ఎకనామిక్స్, ఇదే నా పాలిటిక్స్... ఇదే మా నాన్నగారిని చూసి నేర్చుకున్న హిస్టరీ. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నాం. నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే.. నా యుద్ధం..పెత్తందార్లతోనే... నా ప్రయాణం సామాన్యులు, పేదవర్గాలతోనే' అని జగన్ స్పష్టం చేశారు.
'పరిపాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా నాలుగేళ్ల పనిచేశాం. మేనిఫెస్టోలో చెప్పిన 98.5 శాతం హామీలు అమలు చేశాం. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం. అందరికీ మంచి చేశాం. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నాం. ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోంది. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది' అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
'ఏపీ రోల్ మోడల్ స్టేట్గా మారింది. రేషన్ను నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే వ్యవస్థ దేశంలో ఎక్కడైనా ఉందా?. డెలివరీ వాహనాల ద్వారా నాణ్యమైన రేషన్ సరుకులు ఇస్తున్నాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ క్లాసులు ఉంటాయి. కార్పొరేట్ బడులు ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా మార్పు తెచ్చాం. నాడు-నేడు కింద 40వేల ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మార్పులు తెచ్చాము. ట్యాబ్ల విషయంలో ప్రైవేటు స్కూల్స్ సైతం పోటీకి రావచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులతో ప్రైవేటు పాఠశాలలు పోటీ పడతాయి' అని ముఖ్యమంత్రి వివరించారు.
'డీబీటీ ద్వారా రూ.1,97,473 కోట్లు లబ్ధిదారులకు అందించాం. గడప గడపకు వెళ్లి మేం చేసిన మంచిని చెప్తున్నాం. జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యాయి. సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుతున్నాయి. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సేవలందిస్తున్నారు. 15004 గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. గ్రామ/వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. 2.60 లక్షల మంది వాలంటీర్లు మంచి చేస్తున్నారు' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa