ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడంలేదు: సజ్జల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 06:17 PM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఏ రకంగానూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా ఎంతమాత్రం భావించడం లేదని ఆయన స్పష్టంచేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లన్నీ ఆ పార్టీవి కావని సజ్జల వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లు టీడీపీ వైపు మళ్లాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈసారి ఆ పార్టీల మధ్య అంగీకారం కుదిరిందని అన్నారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని సజ్జల ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని సజ్జల అన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతో అంతా అయిపోలేదని, తాము డీలా పడాల్సింది అంతకంటే ఏమీలేదని ఆయన అన్నారు.


‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నాలుగేళ్లుగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదు’ అని సజ్జల వ్యాఖ్యానించారు. ‘మొత్తం ఓట్లు రెండు లక్షలు ఉంటాయి. వాటిలో పోలైనవి ఎన్ని? చెల్లినవి ఎన్ని.. అన్నీ చూడాలి’ అని సజ్జల వ్యాఖ్యానించారు.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీ చేసిందని పేర్కొన్న సజ్జల.. తెలంగాణలో చేసిన తరహాలోనే ఏవైనా ప్రయత్నాలు చేయొచ్చునని ఘాటు విమర్శలు చేశారు. పరోక్షంగా ‘ఓటుకు నోటు’ కేసు గురించి ప్రస్తావించారు.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 3 పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3 చోట్లా టీడీపీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ ఆధిక్యంతో విజయం సాధించగా.. తూర్పు రాయలసీమలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ స్థానంలో టీడీపీ బలపరిచిన భూమి రెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa