ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గుర్తించారు: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 19, 2023, 06:18 PM

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని.. అందుకే చైతన్యం, బాధ్యతతో వచ్చి ఓట్లేశారన్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎం జగన్‌ గత నాలుగేళ్లలో విధ్వంస పాలన కొనసాగించారని విమర్శించారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ప్రజా విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రజా తీర్పును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. 


సీఎం జగన్‌ బాధ్యత లేని వ్యక్తి అని, మోసాలు చేయడంలో దిట్ట అని చంద్రబాబు అన్నారు. ధనబలం.. రౌడీయిజం.. ఎప్పటికీ శాశ్వతం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిచే పరిస్థితి లేదని.. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో చెప్పేశారని పేర్కొన్నారు. సీఎం జగన్‌ తన అక్రమాలను నమ్ముకుని, వాటితోనే ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారని.. ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడితే కేసులు పెట్టించి వేధించారని తెలిపారు.


నేరాల్లోనూ అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ పాలనలో కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సహా అధికారులను కోర్టులు చీవాట్లు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అసెంబ్లీ, శాసనమండలిని ప్రహసనంగా మార్చారని.. కోర్టులు, జడ్జిలను బ్లాక్‌ మెయిల్‌ చేసేలా ప్రవర్తించారని విమర్శించారు.


ఇక, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. ఐదో తరగతి చదివిన వ్యక్తికి కూడా ఓటు హక్కు కల్పించారన్నారు. ఓటుకు రూ.10 వేలు, వెండి నగలు ఇచ్చి మభ్యపెట్టారన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. కౌంటింగ్‌ హాలులోనూ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఎమ్మె్ల్సీ ఎన్నికలకు పులివెందుల నుంచి మనుషులను పంపించారన్నారు. కానీ, జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజల్లోనూ తిరుగుబాటు ప్రారంభమైందని తెలిపారు. ఓటమిని అంగీకరించలేని పరిస్థితి వైసీపీదీ అని.. మీ పని అయిపోయింది.. ఇకపై మీ ఆటలు సాగవని చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa