మనదేశంలో వాతావరణం ఏ స్థాయిలో కాలుష్యమవుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోచిలోని వ్యర్థాల శుద్ది ప్లాంట్లో సంభవించిన అగ్ని ప్రమాదంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంటూ.. కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్కు రూ.100 కోట్ల భారీ జరిమానా విధించింది. కొచ్చి శివారు బ్రహ్మపురం ప్రాంతంలోని వ్యర్థాల శుద్ధి ప్లాంట్లో మార్చి 2 మంటలు చెలరేగి వేగంగా వ్యాపించిన విషయం తెలిసిందే. నేవీ అధికారులు రంగంలోకి దిగి మూడు రోజుల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంతో కొచ్చి నగరం గ్యాస్ ఛాంబర్గా మారిపోయి.. ప్రజలు ఊపిరి పీల్చుకోడానికి ఇబ్బందిపడ్డారు.
ఈ ప్రమాదం కొచ్చిలో సంక్షోభ తరహా పరిస్థితులకు దారి తీసినట్లు మీడియా కథనాలు రావడంతో ఎన్జీటీ సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్తకుప్పల వద్ద అగ్నిప్రమాదాలను నిరోధించడంలో మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైనందుకు రూ.100కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెల్లించాలని స్పష్టం చేసింది. జరిమానా సొమ్మును అగ్ని ప్రమాద బాధితులు ఆరోగ్యం, ఇతర నివారణ చర్యలకు వినియోగించాలని సూచించింది.
నెల రోజుల్లోగా రూ.100 కోట్లు జరిమానా చెల్లించాలని, బాధ్యతరాహిత్యానికి కారణమైనవారిపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, కేరళ ప్రభుత్వం, కోచి మున్సిపల్ కార్పొరేషన్లు బాధ్యత నుంచి తప్పించుకోలేరని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. అగ్నిప్రమాద నివారణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడింది.
గాలిలో చెత్తాచెదారం, చుట్టుపక్కల ఉన్న చిత్తడి నేలల్లో ప్రాణాంతక పరిమాణంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించిన ధర్మాసనం.. భవిష్యత్తులో సజావుగా పనిచేసేలా వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. కేరళలో ముఖ్యంగా కొచ్చిలో వ్యర్థాల నిర్వహణలో నిరంతర వైఫల్యాన్ని కూడా ఎన్జిటి ఆదేశం విమర్శించింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.500 కోట్ల జరిమానా వసూలు చేస్తామని ఛైర్మన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ఎన్జీటీ బెంచ్ హెచ్చరించింది.
మరోవైపు, బ్రహ్మపురం అగ్నిప్రమాదంలో తీసుకున్న చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి వివరణాత్మక అఫిడవిట్ను ట్రైబ్యునల్కు కేరళ ప్రభుత్వం సమర్పించింది. బ్రహ్మపురం ప్లాంట్లో సేంద్రియ వ్యర్థాలను తగ్గించి, ప్లాస్టిక్ వ్యర్థాలను వేయబోమని పేర్కొంది. ఇప్పటికే కేరళ హైకోర్టు స్వచ్ఛందంగా కేసును స్వీకరించినందున ట్రిబ్యునల్ ద్వారా మరో కేసును ప్రారంభించరాదని రాష్ట్రం అభ్యర్థించింది. ప్లాంట్లోని ప్లాస్టిక్, మెటల్, ఇంతర పదార్థాలు కాలిబూడిదవడంతో విషవాయువులు వెలువడి చుట్టుపక్కల కాలనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీని కారణంగా కళ్లు మంటలు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa