రాష్ట్రంలో రూ. 100 కోట్లతో మరో మూడు పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ గెజిట్ విడుదల చేశారు. ఈ వివరాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్ జిల్లా మైదుకూరుల్లో నూతనంగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు బుగ్గన రాజేంద్రనాత్ రెడ్డి వెల్లడించారు. ఈ కాలేజీలు అందుబాటులోకి వస్తే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, మెటలర్జికల్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ముఖ్యంగా రాలయసీమలోని గ్రామీణ యువతకు మరింత వెసులుబాటు ఉంటుందన్నారు.
నూతన పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు మరింత మెరుగుపడి విద్య పూర్తవగానే ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని మంత్రి బుగ్గన తెలిపారు. మంజూరైన 3 పాలిటెక్నిక్ కాలేజీల్లో ఒకదాన్ని రూ. 30 కోట్లతో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గ పరిధిలోని బేతంచెర్లలో ఏర్పాటు చేస్తుండటం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 3 కాలేజీలను వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికే కేటాయించడం పట్ల ధన్యవాదాలు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa