సీఎం జగన్కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా తనలాగా సెల్ఫీ దిగే దమ్ము ఉందా అని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క జల ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ఆయన ప్రశ్నించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయాన్ని లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గత టీడీపీ ప్రభుత్వ పాలనను.. ప్రస్తుత వైసీపీ పాలనను పోలుస్తూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా తనలాగా సెల్ఫీ దిగే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఈ మేరకు లోకేష్ మంగవారం వరుస ట్వీట్లు చేశారు.
‘‘అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయానికి హంద్రీనీవా జలాలను బొంతలవారిపల్లి ఎత్తిపోతల పథకం ద్వారా చిత్తూరు జిల్లాకు తాగు, సాగునీరు వెళ్తుంది. నిలిచిపోయిందనుకున్న ప్రాజెక్టు పనులు మళ్లీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రారంభించి 2018లో పూర్తి చేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు సాగు, తాగునీరు అందించారు. నదుల అనుసందానం ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుండి 565 కి.మీ నుండి సీమకు చంద్రబాబు తీసుకొచ్చారు. 8 నియోజకవర్గాల్లోని 28 మండలాలకు ఈ నీరు చేరుతుంది.
1.40 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగునీరు అందించడమే చెర్లోపల్లి జలాశయం లక్ష్యం. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అనంతపురం జిల్లాలోనూ చెరువులను నింపి తద్వారా తాగునీరు అందిస్తారు. జగన్ కు రాయలసీమలో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ ముందు అయినా ఇలా సెల్ఫీ దిగే దమ్ము ఉందా?’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa