జాతీయ జెండాను కించపరుస్తూ లండన్లో ఖలీస్థాన్ మద్దతుదారుల నిరసన తెలుపగా..దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు ‘వారిస్ పంజాబ్ దే’ నేత అమృత్పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అమృత్పాల్ కోసం పోలీసుల గాలింపును నిరసిస్తూ అతడి మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఖలిస్థాన్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో భారత జాతీయ జెండాను ఖలిస్థానీ మద్దతుదారులు కించపరిచారు. హైకమిషన్ భవనంపై ఎగురవేసిన త్రివర్ణ పతాకాన్ని కిందికి దింపివేశారు.
త్రివర్ణ పతాకాన్ని కిందికి దింపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా... ఈ సంఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. హైకమిషన్ కార్యాలయంపై భారీ త్రివర్ణ పతాకాన్ని తాజాగా ఎగురవేసింది. దీంతో ఖలిస్థానీ మద్దతుదారులకు భారత హైకమిషన్ చెంపపెట్టులాంటి నిర్ణయం తీసుకున్నట్టయ్యింది. భారత పతాకాన్ని అగౌరవ పరిచిన చోటే భారీ పతాకాన్ని ఏర్పాటు చేసింది. సంఘటన జరిగిన 24 గంటల్లోనే హై కమిషన్ బిల్డింగ్ పై భారీ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ వీడియోను హైకమిషన్ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
అటు, ఢిల్లీలోని యూకే సీనియర్ దౌత్యవేత్త క్రిస్టినా స్కాట్కు ఆదివారం సమన్లు జారీ చేసిన భారత ప్రభుత్వం.. లండన్లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నిరసన తెలిపింది. దీనికి బాధ్యులైనవారిపై యూకే ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ చర్యను తీవ్రమైందని, అక్కడకు నిరసనకారులు వచ్చేంతవరకూ భారత హైకమిషన్ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది.
ఈ ఘటనపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని భారత విదేశాంగశాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది. కాగా, ఈ చర్యలపై యూకే కామన్వెల్త్ దేశాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి లార్డ్ తారిఖ్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘‘లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఈ రోజు జరిగిన దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది.. భారత్ మిషన్, దాని సిబ్బంది సమగ్రతకు వ్యతిరేకంగా జరిగిన ఇటువంటి చర్యలు ఆమోదయోగ్యం కాదు... భారత హైకమిషన్ భద్రతను యూకే ప్రభుత్వం ఎల్లప్పుడూ సీరియస్గా తీసుకుంటుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలావుంటే అమృత్పాల్ సింగ్ కోసం పోలీసులు మూడు రోజులుగా గాలిస్తున్నారు. పంజాబ్ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa