ఏపీ శాసనసభలో కొత్త నియమనిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల పరిణామాల తర్వాత స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో స్పీకర్ పోడియం ముందు కొత్తగా రెడ్ లైన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ గీతను దాటి ఎవరు లోపలికి వస్తే సస్పెన్షన్ వేటు పడుతుంది.. 3 రోజుల పాటు లేదా, ఆ సమావేశాలు జరిగినన్నాళ్లూ సస్పెండ్ చేస్తామన్నారు తమ్మినేని. సభలో ప్రత్యేకంగా తీర్మానం అవసరం లేకుండా.. ఎర్ర గీత దాటిన వారిని తాను గుర్తించి, వారి పేర్లను వెల్లడిస్తే చాలు సస్పెండ్ అయినట్లేనని తెలిపారు. ఈ మేరకు రూలింగ్ ఇచ్చారు.
గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో రెడ్ లైన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. టీడీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు.. ఆ సమయంలో.. ఆ ప్రశ్న అడిగిన సభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో పాల్గొనేందుకు వెళ్లారని.. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పీకర్ సీతారాం సమాధానాలు డీమ్డ్ టు బి అని అన్నారు. అప్పుడు మంత్రి అంబటి రాంబాబు సభలో ఈ మధ్య జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. టీడీపీ సభ్యులు వచ్చి గొడవ పడి, గందరగోళం సృష్టించే కన్నా వారు రాకపోవడమే మంచిది అన్నారు.
పోడియం ముందు కొత్తగా రెడ్ లైన్ ఉందని గుర్తు చేశారు. సభలో శుక్రవారం ఆఖరిరోజు టీడీపీ ఎమ్మెల్యేలు అల్లరి చేసి వెళ్లాలని చూడొచ్చని.. సమావేశం సజావుగా సాగేలా చూడాలని కోరారు. అప్పుడే స్పీకర్ తమ్మినేని ఒకసారి రూలింగ్ ఇస్తే రూలింగే అని అన్నారు. సభ హుందాతనం కాపాడేందుకు, మిగిలిన సభ్యుల హక్కుల రక్షణకు, కచ్చితంగా దీన్ని అమలు చేస్తామన్నారు. అంటే ఇకపై ఎవరైనా స్పీకర్ పోడియం ముందు రెడ్ లైన్ దాటితే వేటు పడుతుంది.
అలాగే అసెంబ్లీలో ఈబీసీ నేస్తం అమలులో విధివిధానాలను మరింత సరళతరం చేయాలని పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోరారు. నిబంధనలు సరళతరం చేస్తే ఎక్కువ మందికి లబ్ధి కలుగుతుందని.. సచివాలయాల్లో చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను పెండింగులో ఉంచుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకం ధ్రువీకరణ పత్రాలు స్థానిక ప్రజాప్రతినిధులతోనే ఇప్పించాలన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల దరఖాస్తులు కొన్ని తిరస్కరించినా మళ్లీ పరిశీలించి తదుపరి వారికి లబ్ధి కల్పిస్తూనే ఉన్నామని మంత్రి సమాధానం ఇచ్చారు.
ఇటు కల్యాణమస్తు పథకం అమలులో నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో వధువు, వరుడు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉండేది కాదన్నారు. తాజాగా ఈ నిబంధన విధించారని.. అది మంచిదే అయినా గిరిజన ప్రాంతాల్లో దీని వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. కల్యాణమస్తులో ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామని.. గత ప్రభుత్వం హయాంలో గడువు దాటితే మళ్లీ దరఖాస్తుకు అవకాశం ఉండేది కాదన్నారు మంత్రి.
మరోవైపు బడ్జెట్పై మండలిలో చర్చ జరిగింది. బడ్జెట్ విషయంలో బడ్జెట్ రూ.2,79,279 కోట్లు ఎలా వచ్చిందనే అనుమానాలు రావడంపై మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు. ఇది మ్యాజిక్ ఫిగర్ కాదు.. రియల్ ఫిగర్ అన్నారు. ఉదాహరణకు రూ.280 ఖర్చవుతుందనుకుంటే.. అందులో ఒక రూపాయి తగ్గిస్తే రూ.279 వస్తుంది అన్నారు. అలా సర్దుబాటు చేస్తే ఈ లెక్క వచ్చిందన్నారు. తమ పాలనలో ఈ నాలుగేళ్లలో ప్రజల సంక్షేమానికి భారీగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు సంక్షేమం వద్దని చెబుతాయా అని ప్రశ్నించారు మంత్రి. ఫ్యామిలీ డాక్టర్, నాడు నేడుకు భారీగా ఖర్చు చేశామన్నారు. వ్యవసాయ రంగంలో సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa