దేనికైనా రాసిపెట్టి ఉండాలంటారు. రాసిపెడితే వద్దన్న అన్నీ వరిస్తాయి మరీ. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొత్తం ఏడు స్థానాల్లో వైఎస్సార్సీపీకి ఆరు.. టీడీపీకి ఒక స్థానం దక్కింది. వీరిలో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన పోతుల సునీత, పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజులది లక్ అని చెప్పాలి. సునీతకు మూడోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాగా.. సూర్యనారాయణరాజుకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు.
పోతుల సునీత వరుసగా మూడోసారి ఎమ్మెల్సీగా విజయాన్ని అందుకున్నారు. సునీత టీడీపీలో చేరి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో జెడ్పీటీసీగా గెలిచారు. టీడీపీ తరపున 2009లో అలంపూర్ నుంచి పోటీ చేసినా ఓటమి ఎదురైంది. 2014లో అప్పటి ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. ఆమంచి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమంచి టీడీపీలోకి రావడంతో స్థానిక సమీరణాలతో చంద్రబాబు సునీతకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019లో సునీత ముఖ్యమంత్రి జగన్ను కలిసి మద్దతు తెలిపారు. అనంతరం టీడీపీకి గుడ్ చెప్పిన ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయినా సరే తర్వాత సీఎం జగన్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆ పదవీకాలం ముగియగా.. మూడోసారి కూడా ఛాన్స్ దక్కింది.. మళ్లీ ఆమె ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సభలో అడుగు పెట్టబోతున్నారు.
ఇక పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు రెండోసారి మండలికి ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన దివంగత మాజీ మంత్రి, సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడే డెంటిస్ట్ సూర్యనారాయణరాజు. ఆయన ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచారు.. 2014లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. 2019 ఎన్నికల్లో సూర్యనారాయణకు టికెట్ ఇవ్వలేదు.. అయితే మరో విధంగా న్యాయం చేస్తామని చెప్పారు. 2020 ఆగస్టులో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంటే రెండోసారి ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు.
అలాగే ఎమ్మెల్సీలుగా గెలిచిన మరో జయమంగళ వెంకటరమణ .. ఇటీవలే టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరగా.. వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది.. ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆయన గతంలో కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మర్రి రాజశేఖర్ కూడా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి ఓడారు.. 2019లో టికెట్ విడదల రజినికి దక్కడంతో.. అధినేత వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకున్నారు.
మిగిలిన వారి విషయానికి వస్తే.. చంద్రగిరి ఏసురత్నంది పల్నాడు జిల్లాకాగా.. గతంలో డీఐజీ స్థాయి అధికారిగా ఉన్నారు. ఆయన 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైఎస్సార్సీపీలో చేరారు.. అనంతరం 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడారు. ఆయనకు గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్గా పదవి దక్కింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మండలికి వెళుతున్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన బొమ్మి ఇజ్రాయేల్ కు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. కాంగ్రెస్ హయాంలో ఉప సర్పంచిగా గెలిచిన ఆయన.. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు అధినేత జగన్ ప్రమోషన్ ఇచ్చారు.. ఆయన ఎమ్మెల్యే కోటాలో మండలిలో అడుగు పెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa