విజయవాడ దుర్గగుడిలో మహా మండపం కింద లడ్డూ ప్రసాదాల కౌంటర్లో.. చీమలు పట్టిన లడ్డూలు దర్శనమిచ్చాయి. వాటినే భక్తులకు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చీమలు ఉన్న లడ్డూలు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రసాదం పంపిణీ చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ప్రసాదం పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గతంలో ఇక్కడే రికార్డుల్లోకి ఎక్కించకుండా పులిహోర ప్యాకెట్లు అమ్మడంపై వివాదం చెలరేగింది. ఈ అంశం పెద్ద రచ్చకు కారణమైంది. ఆ సమయంలో.. పలువురు సిబ్బందిపై ఈవో భ్రమరాంబ చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మరో అపచారం జరిగింది. ఓ మహిళా భక్తురాలు కొండపైకి దర్శనానికి వచ్చి గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్ను సెల్ఫోన్లో చిత్రీకరించి ఇన్స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. అప్పడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
రెండ్రోజుల కిందట కూడా.. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి బూతు పురాణం హాట్ టాపిక్గా మారింది. టోల్ గేట్ దగ్గర పనిచేసే సిబ్బందిని చెప్పలేని మాటల్లో తిట్టాడు. దీనిపైనా భక్తులు అసహనం వ్యక్తం చేశారు. దుర్గమ్మ సన్నిధిలో ఇలా తరుచూ ఏదో ఒక వివాదం వెలుగులోకి వస్తోంది. అటు పలు సంఘటనలు ఆలయంలో నిఘా వ్యవస్థపై అనుమానం కలిగేలా చేస్తున్నాయి. వీటిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన అమ్మవారి ఆలయంలో.. ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ మధ్యే మరో అపచారం వెలుగులోకి వచ్చింది. ఇంద్రకీలాద్రిపై నటరాజ స్వామి ఆలయం వెనుక ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో.. వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన అర్చకుడు గణేష్.. తాను మృత్యుంజయ హోమంలో పాల్గొనడానికి వెళుతూ.. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కల మండలం, వీరంకిలాకులు ప్రాంతానికి చెందిన కనుపూరి సుబ్రహ్మణ్యంను విధుల్లో పెట్టాడు. ఆయన బలిహారణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోశాడు. అక్కడితో ఆగకుండా దీన్ని గమనించి ప్రశ్నించిన భక్తులపై దురుసుగా మాట్లాడాడు. అది తప్పు కాదంటూ బుకాయించాడు. అతనిపై చర్యలు తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa