ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ... వైసీపీ సర్కార్ కు చుక్కెదురు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2023, 06:38 PM

 అమరావతి గురించి హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టులో జగన్ సర్కారుకు చుక్కెదురైంది.  కేసు తదుపరి విచారణను జులై 11న చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. అంతకు ముందు దీని విచారణ సాధ్యం కాదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు.


అమరావతి పై పిటిషన్ల విచారణ సందర్భంగా.. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే కోరారు. తమ స్టే పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. జులై 11 న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం చెప్పింది. జులై 11 వ తేదీకి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా వాడీ వేడి వాదనలు జరిగాయి. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత.. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదని.. ఏపీ తరఫున కెకె వేణుగోపాల్ వాదించారు.


అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ణప్తులను న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జూన్ 16వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ కెఎం జోసెఫ్.. అందుకే ఈ కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. తాను రిటైర్ అవుతున్న సమయంలో.. అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కెఎం జోసెఫ్ వ్యాఖ్యానించారు.


పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని.. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు అనుమతి కోరారు. అనుమతించి.. వారికి నోటీసులు పంపాలని.. ప్రభుత్వ న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


ఇటు హైకోర్టు తీర్పును యథాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ అమరావతి రైతులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి కెఎం జోసెఫ్, బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారిస్తుంది. ఈ కేసులో.. అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల గురించి తమకు కేంద్రం కేంద్రం స్పష్టం చేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa