కేంద్రంలోని బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతోందోనని కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రారావు పేర్కొన్నారు. ఇదిలావుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన ‘ఆత్మ’గా పిలిచే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శనివారం కేవీపీ రామచంద్రారావు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్కు అత్యంత సన్నిహితంగా ఉన్న తాను.. ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పబోనన్నారు. కానీ, ఈ ప్రశ్నల నుంచి తాను ఎంతో కాలం దూరం జరగలేనని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే అని.. మరొక రోజు ప్రెస్మీట్ పెట్టి అన్ని విషయాలను వివరిస్తానని వెల్లడించారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సంబంధాలపై కేవీపీ సీరియస్గానే స్పందించారు. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుందో తనకు కారణం తెలియదన్నారు. ప్రత్యేక పరిస్థితులని చెప్పిన తానే.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటో తెలియదని చెబుతున్నానని అన్నారు. ఇదే సమయంలో, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై కేవీపీ విరుచుకుపడ్డారు. 2018లో తెలంగాణలో టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు తాను ఎక్కడా చెప్పలేదన్నారు. టీడీపీతో పొత్తు నచ్చకపోయినా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నోరు మెదపలేదన్నారు. అలాగే, ఆనాడు తానెక్కడా ప్రచారంలో కూడా పాల్గొనలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ రాష్ట్రానికి చంద్రబాబు మరణ శాసనం రాశారని కేవీపీ దుయ్యబట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేయడం చంద్రబాబు వల్లే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. 2016లో రాహుల్ గాంధీపై రాళ్లు వేయించిన చంద్రబాబు.. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తప్పుబట్టారు. ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసి.. అదే ఎన్టీఆర్ను పార్టీ నుంచి బయటకి పంపిన ఘనుడు చంద్రబాబు అని ఫైరయ్యారు. వైఎస్సార్ తవ్వించిన కాల్వల నుంచి నీరు పారించి.. మొత్తం తానే చేశానని చెప్పుకునే ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.
సెల్ ఫోన్లు తెచ్చిన సమర్థుడు.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని కేవీపీ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దేనికి.. ఢిల్లీకి వచ్చి పోరాడాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa