వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానులతోనే జనంలోకి వెళ్లామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం మూడు రాజధానులే అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. లక్షల కోట్ల రూపాయిల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందినవారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరని ఆరోపించారు. అమరావతి రైతులు టెంటు వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్తా అని ప్రశ్నించారు.
మూడు రాజధానుల విధానంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. విశాఖపట్నం నుంచే పరిపాలన ప్రారంభించాలనేది తన అభిప్రాయమన్నారు. న్యాయ చిక్కులు, సాంకేతిక సమస్యలు లేకపోతే రేపటి నుంచే విశాఖలో పాలన ప్రారంభించాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఇక, అమరావతిపై గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
ప్రతి ఊరు అంటే శ్మశానం కూడా ఉంటుందని.. ఆ ఉద్దేశంతోనే అమరావతిని గతంలో శ్మశానం అన్నానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే, నివాసయోగ్యమైనందుకే అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నామని చెప్పారు. ఇక, రాష్ట్రంలో ముందుస్తు ఎన్నికలపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ఐదేళ్లు పరిపాలించాలని రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారని.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుని ముందస్తుకు వెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
అలాగే, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై మంత్రి రియాక్ట్ అయ్యారు. విశాఖపట్నం రాజధాని సెంటిమెంట్ను ప్రజలు నమ్మలేదనే వాదనతో ఏకీభవించబోనని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటామని చెప్పారు. ఇక, ఉత్తరాంధ్రలో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం తన వైఫల్యంగానే భావిస్తున్నానని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa