ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూపాయికే చిక్కెన్ బిర్యాన్ని...ఎగబడ్డ జనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 07, 2023, 07:35 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం కోర్టు సెంటర్‌లో ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభించారు. రూపాయికే చికెన్ బిర్యానీ అంటూ ఆఫర్ పెట్టారు.. అది కూడా గురువారం ఒక్కరోజు మాత్రమే.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే అని బాగా ప్రచారం చేశారు. పాత రూపాయి నోట్‌కు మాత్రమే బిర్యానీ అనడంతో.. ఇంకేముంది బీరువాలు, ట్రంకు పెట్టెలో దాచుకున్న పాత రూపాయి నోటును బయటకు తీశారు.


ఆ నోట్లతో వందలాదిమంది జనాలు రెస్టారెంట్ దగ్గరకు క్యూ కట్టారు. జనాలు ఒక్కసారిగా అక్కడ బారులు తీరడంతో.. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. రెస్టారెంట్ యజమాని అనుకున్నదానికన్నా ఎక్కువ మంది రూపాయి నోట్లతో బిర్యాని కోసం వచ్చారు. అయితే గంటలోపే బిర్యాని అయిపోయిందని యజమాని రెస్టారెంట్ మూసేసి వెళ్లాడు. కొంతమందికే బిర్యానీ దొరకగా.. దక్కనివారు నిరాశగా వెనక్కు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.


కొత్తగా ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌కు ప్రచారం కల్పించేందుకు యజమాని ఇలా ప్లాన్ చేశాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.. యజమాని చేసిన వినూత్న ఆలోచన బెడిసికొట్టింది. మార్కెట్‌లో ఎన్ని పాత రూపాయి నోట్లు ఉంటాయో అంచనా వేయలేకపోవడంతో చిక్కంతా వచ్చి పడింది. రూపాయి నోటుకే బిర్యాని ప్యాకెట్‌ అనడంతో జనాలంతా నోట్లతో అక్కడికి క్యూ కట్టారు.


గతంలో కూడా కొన్ని రెస్టారెంట్‌లు ఇలాంటి ఆఫర్లు ప్రకటించాయి. కొన్ని రెస్టారెంట్‌లు ఐదు పైసలకే బిర్యానీ పేరుతో ఆఫర్ ఇవ్వడంతో అక్కడికి కూడా జనాలు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. తిరుపతిలోని ఓ రెస్టారెంట్ ఐదు పైసలకే బిర్యానీ అని ఆఫర్ ప్రకటించింది. అలాగే కస్టమర్లకు మరో ఆఫర్ ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ లో వచ్చిన కస్టమర్లకు 50% రాయితీ ఇస్తామని ప్రకటించారు. అక్కడ జనాల తాకిడితో యజమాని అవాక్కయ్యాడు.


విజయవాడలో కూడా ఓ హోటల్ మరో ఆఫర్ ప్రకటించింది. ఐదు పైసల నాణెం తీసుకొస్తే భోజనం ఫ్రీ అన్నారు. అది కూడా మొదటి 50మందికే మాత్రమే అని ప్రకటించారు.. జనాలు భారీగా క్యూ కట్టినా 50 తర్వాత వచ్చిన వాళ్లు నిరాశతో వెనక్కు వెళ్లిపోయారు. విశాఖలో కూడా ఓ రెస్టారెంట్ కూడా బిర్యానీ ఆఫర్ ప్రకటించింది. ఐదు పైసలకే బిర్యానీని 250 మందికి అందజేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa