కరోనా వైరస్ అంతమైందని ఊపిరీ పీల్చుకొంటున్న సందర్భంలో మరోసారి పడగవిప్పింది. చాపకింద నీరులా దేశంలో రోజువారీ కరోనా వైరస్ కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,050 కొత్త కేసులు బయటపడ్డాయి. ముందు రోజు నమోదైన 5,335 కేసులతో పోల్చితే ఇవి 13 శాతం అధికం. అంతేకాదు, గతేడాది సెప్టెంబరు 16 తర్వాత రోజువారీ కరోనా కేసులు 6 వేలు దాటడం ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో దేశంలో 1,78,553 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6 వేలకుపైగా కేసులు బయటపడ్డాయి.
అలాగే, మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కరోనాతో మరో 14 మంది చనిపోయారు. మహారాష్ట్రలో మూడు, కర్ణాటక, రాజస్థాన్లో రెండేసి, ఢిల్లీ, హరియాణా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్లో ఒక్కో మరణం నమోదయ్యింది. దేశంలో ఇప్పటి వరకూ 5,30,943 మంది కరోనాతో చనిపోయారు.
రోజువారీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 3.39 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 3 శాతం దాటేసింది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి మరో 3,320 మంది కోలుకోగా.. మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,41,85,858గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,303కి చేరింది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. శుక్రవారం మరోసారి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో అత్యవసర సమీక్షా సమావేశానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు.
రెండు రోజుల కిందట ఓ జాతీయ మీడియా ఛానల్తో కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ.. ఇన్ఫెక్షన్ల పెరుగుదలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఐసీయు పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర క్లిష్టమైన సంరక్షణ ఏర్పాట్లు చేశామని, సంసిద్ధతపై వారినికొకసారి సమీక్ష చేస్తున్నామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa