ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్టిలకు వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని రద్దు చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 09, 2023, 10:55 AM

రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను చులకనగా చూస్తున్నదని, ఎస్టిలకు అన్యాయం జరిగే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయడమే ఇందుకు ఉదాహరణ అని గిరిజన సంఘం జెఏసి నాయకులు అన్నారు. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు నిరసనగా ఏపీ గిరిజన సంఘం, ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గిరిజన శాఖా మంత్రి పీడిక రాజన్న దొర ఇంటికి వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. అనంతరం శనివారం డిప్యూటీ సీఎంకి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షులు సుందర్రావుతో పాటు సిఐటియు జిల్లా కార్యదర్శి నాయుడు తదితరులు మాట్లాడుతూ ఆర్థికంగా అభివృద్ధి చెంది, మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న బోయ, వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలనుకోవడం గిరిజనుల గొంతు కొయ్యడమే అన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు వారి పట్ల జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పకపోవడం శోచనీయమన్నారు. కావున గిరిజనులకు అన్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నారు. అలాగే ఐటీడీలను బలోపేతం చేయాలని, 1/70చట్టంతో పాటు పెండింగ్లో ఉన్న పనులను పూర్తయ్యేలా చూడాలని, ఏజెన్సీలో రహదారులను నిర్మించాలని, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరిగేలా చూడాలని కోరారు.


గిరిజనులకు అన్యాయం జరగనివ్వను డిప్యూటీ సీఎం ఇది ఇలా ఉండగా గిరిజన జెఏసీ ప్రతినిధులు చెప్పిన విషయాలను విన్న ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర సానుకూలంగా స్పందించారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని, ఏజెన్సీ గ్రామాల్లో రహదారుల నిర్మాణాన్ని చాలెంజ్ గా తీసుకొని చేపట్టానన్నారు. అలాగే గిరిజనులకు అన్యాయం జరగనివ్వనన్నారు. తాను గిరిజనుడినే కావున గిరిజన సమస్యల గూర్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, వారి సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అలాగే గిరిజనులు చేస్తున్న ఆందోళన విషయమై చర్చ జరుగుతున్నదని, జేఏసీ ప్రతినిధులు వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి మాట్లాడే విధంగా చూస్తానన్నారు. ఈ విషయమై ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో డి. ఆనంద్, గమ్మెల జానకిరావు, నాగేశ్వరరావు, ప్రభాకర్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa