టీడీపీ హయాంలో మైనింగ్ పేరుతో ఇసుకపై కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా దోపిడీ చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీ హయాంలోనే మాఫియా, మైనింగ్ దోపిడీ విపరీతంగా జరిగిందని అన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీశైలంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ద్వారా ఇసుకతో రూ. వందల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. కానీ, ఈ విషయంలో ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. వందల కోట్లు దోచుకుని చినబాబుకి, పెదబాబుకి వాటా వెళ్లిందని ఎమ్మెల్యేలే అప్పట్లో బాహాటంగా చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఇసుకపై సంవత్సరానికి రూ. 700 కోట్ల నుంచి రూ. 800 కోట్ల ఆదాయం వస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ఇక, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినా ఎవరూ రానివ్వలేదని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకి అవకాశం దొరికిందని ఆయన కూడా చెప్పరన్నారు. పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ హితవుపలికారు. ఆయనకు ఆ అవకాశం ఉందన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం చనిపోయిందని.. ఎవరికీ ప్రజలు నుంచి గుర్తింపు కూడా లేదన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బాటలో వెళ్తే పవన్ కళ్యాణ్ జన్మలో ముందుకు పోలేరని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్ వెంటే ఉన్నారని.. మరోసారి ఆయనే సీఎం అవుతారని చెప్పారు.
మొన్న టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ట్రైలర్, టీజర్ అని అంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అయితే, ఇటీవల గన్నవరంలో చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి జరిగినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటుకు నోటుతో పారిపోయిన దొంగలు.. నలుగురు ఎమ్మెల్యేలను రూ. కోట్లతో కొనేసి ఒక్క ఎమ్మెల్సీ గెలిచి ట్రైలర్ అంటున్నారని ఫైరయ్యారు.
టీడీపీకి దమ్ము, ధైర్యం ఉంటే తమకు ఇంకా సంవత్సర కాలం ఉందని.. 19 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. నిన్న ఆదోని ఎమ్మెల్యే కూడా సీఎం జగన్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు.. ఆయనకు మరో అవకాశం ఇస్తే అనుభవపూర్వకంగా మరింత అభివృద్ధి చేస్తారని అన్నారని పేర్కొన్నారు.
ఇదిలావుంటే చంద్రబాబు అనుకూల మీడియా ఏదో ముక్కలు చేసి కలిపించి చెప్పారని మంత్రి సత్యనారాయణ ఆరోపించారు. ఇక మే 25వ తేదీన శ్రీశైలంలో జరిగే కుంభాభిషేకానికి సీఎం జగన్ వస్తారన్నారని వెల్లడించారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా క్యూ కాంప్లెక్స్ డిజైన్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఫౌండేషన్ వేయించి గ్యాలరీ ఏర్పాటు చేస్తామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa