బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తతో మాట్లాడాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును ఉద్దేశించి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా సూచించారు. వాళ్ల రాష్ట్రం గురించి వాళ్లు చూసుకుంటే మంచిదని హితవుపలికారు. ఆంధ్రప్రదేశ్లో పాలకులు ప్రజలను గాలికొదిలేసి సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీలు ఏపీని ఆగం చేశాయని మండిపడ్డారు. ఆంధ్రా మంత్రులు అనవసరంగా తమ జోలికి రావొద్దంటూ హరీశ్ రావు హెచ్చరించారు.
ఈ క్రమంలో హరీష్రావుకు ఏపీ మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలని హితవుపలికారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏం మాట్లాడారో తమకు తెలుసన్నారు. ఆంధ్ర వాళ్లు తెలంగాణలో ఉండాలనుకుంటారో? తెలంగాణ వాళ్లు అమెరికాలో ఉండాలని అనుకుంటున్నారో? అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం హరీష్ రావు మాట్లాడతారని.. ఎవరో ఏదో మాట్లాడితే తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. బాధ్యత గల వ్యక్తులు అన్నీ తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు.
మరోవైపు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై మంత్రి బొత్స ఫైరయ్యారు. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏం ఉద్దరించారని ప్రశ్నించారు. ఆయన చేసిన ఒక మంచి కార్యక్రమం పేరైనా చెప్పాలని సవాల్ విసిరారు. అమరావతిలో జరిగింది దోపిడీనా? అద్భుతమైన కార్యక్రమమా? అని నిలదీశారు.. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేలా చంద్రబాబు ఒక్క కార్యక్రమమైనా చేశారా అని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. చంద్రబాబు రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి అని.. ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకూ పనికి రావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. ఈ మేరకు బుధవారం మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. దౌర్భగ్యమైన మాటలు మాట్లాడొద్దంటూ హరీష్ రావుకు చురకలంటించారు. ధనిక రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే ఏం చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. హరీష్ రావు ఏపీకి వస్తే ఏం జరుగుతుందో చూపిస్తానని చెప్పారు. హైదరాబాద్లో వర్షం వస్తే ఇళ్లపై నుంచి నీళ్లు వెళ్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో తేడా చూసుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో సంక్షేమ పథకాలకు, తమ పథకాలకు తేడా చూసుకోవాలన్నారు.
జీడీపీలో తాము దేశంలోనే నంబర్ వన్గా ఉన్నామని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. హరీష్ రావు ముందు వారి రాష్ట్రం సంగతి చూసుకోవాలని హితవుపలికారు. అలాగే, ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఇక, అంతకుముందు హరీష్ రావు.. ఏపీ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా ఇక్కడే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో, హరీష్ రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కౌంటర్ ఇస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa